బుద్ధుని బోధ: నది వద్దకు వెళ్లిన శిష్యులు.. ఒకనికి మురికి నీరు కనిపించగా, మరొకనికి స్వచ్ఛమైన నీరు లభించింది..ఇంతలో ఏమైంది?

ABN , First Publish Date - 2021-11-07T14:29:38+05:30 IST

ఈ కథ గౌతమ బుద్ధుడు భారతదేశంలో పర్యటిస్తూ బౌద్ధ ధర్మాన్ని..

బుద్ధుని బోధ: నది వద్దకు వెళ్లిన శిష్యులు.. ఒకనికి మురికి నీరు కనిపించగా, మరొకనికి స్వచ్ఛమైన నీరు లభించింది..ఇంతలో ఏమైంది?

ఈ కథ గౌతమ బుద్ధుడు భారతదేశంలో పర్యటిస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేస్తున్న రోజుల నాటిది. నాటి రోజుల్లో ధర్మ ప్రచారం సాగిస్తున్న బుద్ధుడు ఒకరోజు తన అనుచరులను వెంటబెట్టుకుని ఊరూవాడా తిరుగుతుండగా, అతనికి చాలా దాహం వేసింది. దీనిని గమనించిన బుద్ధుడు.. ఒక శిష్యునితో..సమీపంలోని గ్రామం నుంచి నీటిని తీసుకురమ్మని పంపాడు. శిష్యుడు ఆ గ్రామానికి చేరుకోగానే.. అతనికి ఒక్కడ ఒక నది కనిపించింది. ఆ నది ఒడ్డున కొందరు దుస్తులు ఉతుకుతున్నారు. అలాగే తమ పశువులను కూడా అక్కడే కడుగుతున్నారు. ఫలితంగా ఆ నదిలోని నీరు మురికిగా కనిపిస్తోంది. ఇటువంటి అపరిశుభ్ర నీటిని గురువుగారి వద్దకు తీసుకువెళ్లడం మంచిది కాదని ఆ శిష్యుడు భావించి, నీటిని తీసుకువెళ్లకుండానే వెనుదిరిగాడు. మరోవైపు ఇదే సమయంలో బుద్ధునికి దాహం మరింతగా పెరిగి, గొంతు ఎండిపోసాగింది. దీంతో బుద్ధుడు మరో శిష్యుడిని పిలిచి తాగునీటిని తీసుకు రమ్మని పంపించాడు. ఈసారి పంపిన శిష్యుడు స్వచ్ఛమైన నీటిని తీసుకువచ్చాడు. 


గౌతమ బుద్ధుడు ఆశ్చర్యపోతూ శిష్యుడితో.. గ్రామంలోగల నదిలోని నీరంతా మురికిగా ఉందికదా, మరి ఈ నీటిని ఎక్కడి నుంచి తీసుకు వచ్చావు? అని అడిగాడు. దీనికి ఆ శిష్యుడు సమాధానమిస్తూ.. అవును గురువుగారూ, నదిలోని నీరు అపరిశుభ్రంగా ఉన్న మాట నిజమే.. అక్కడికి వచ్చినవారంతా నదిలోనే తమ పనులను కానిచ్చేసి వెళ్లిపోతున్నారు. అయితే నేను అక్కడే కొద్దిసేపు ఉండి వేచి చూశాను. కొంతసేపటి తరువాత మురికి నీరంతా కిందకు దిగిపోయి, తేట నీరు పైకి వచ్చి, పరిశుభ్రంగా కనిపించింది. ఆ నీటినే తీసుకువచ్చాను.. అని తెలిపాడు. ఈ సమాధానం విన్న బుద్ధుడు ఎంతో సంతోషించాడు. తరువాత మిగిలిన శిష్యులతో మాట్లాడుతూ.. మన జీవితం కూడా నదిలోని నీరు లాంటిదే.. జీవితంలో ఓర్పు కలిగివుంటే ఎంతటి సమస్యలనైనా ఎదుర్కోవచ్చు. అప్పుడు మన కష్టాలన్నీ.. నదిలోని చెడునీరు కిందకు దిగిపోయి, కనుమరుగైనట్లే మన కష్టాలు కూడా సమసిపోతాయని బుద్ధుడు శిష్యులకు తెలిపాడు. జీవితంలో చెడు పరిస్థితులు ఎదురైనపుడు వాటిని చూసి కుంగిపోకుండా, సహనంతో మెలుగుతూ ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలి. అప్పుడు చెడు పరిస్థితులుకు కూడా వాటంతట అవే అంతమైపోతాయని బుధ్దునికి సంబంధించిన ఈ కథ తెలియజేస్తోంది.   


Updated Date - 2021-11-07T14:29:38+05:30 IST