ఆ విషయం చెప్పేందుకు గంగూలీకి అర్హత లేదు: పీసీబీ

ABN , First Publish Date - 2020-07-09T22:28:33+05:30 IST

ఆసియాకప్ క్రికెట్ టోర్నీ రద్దయినట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పాకీస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మణి కూడా....

ఆ విషయం చెప్పేందుకు గంగూలీకి అర్హత లేదు: పీసీబీ

ఇస్లామాబాద్: ఆసియాకప్ క్రికెట్ టోర్నీ రద్దయినట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పాకీస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహసాన్ మణి కూడా ధృవీకరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో పీసీబీ మీడియా డైరెక్టర్ సమిఉల్ హసన్ గంగూలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసియా కప్ రద్దయిందని చెప్పేందుకు గంగూలీకి ఎలాంటి అర్హత లేదని, ఆ నిర్ణయం ఆసియా క్రికెట్ సంఘం చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. వారానికోసారి మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడితే సరిపోదని, నిజాలను మాత్రమే మాట్లాడాలని గంగూలీకి సూచించారు. ‘ఆసియాలో క్రికెట్ ఆడే దేశాలకు ఆసియా కప్ అనేది ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. అంతటి ముఖ్యమైన టోర్నీ రద్దయిందని చెప్పడానికి గంగూలీ ఎవరు. ఆ అర్హత ఒక్క ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడికి మాత్రమే ఉంది. ఒకవేళ ఆసియాకప్‌ను రద్దు చేసే ఆలోచనే ఉంటే రానున్న ఏసీఏ సమావేశంలో ఈ విషయాన్ని అధ్యక్షుడు నజ్ముల్ హసన్ వెల్లడిస్తారు.


ఆ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అంతేకానీ ఈ విషయానికి సంబంధించి గంగూలీ ఎలాంటి ప్రకటనలు చేసినా అవి పూర్తిగా అర్థం లేనివి’ అంటూ హసన్ మండి పడ్డారు. ఇదిలా ఉంటే బీసీబీ సీఈవో నిజాముద్దీన్ చౌధురీ కూడా ఆసియా కప్ రద్దయినట్లు అప్పుడే నిర్ణయించలేమని, పరిస్థితులు చక్కబడితే టోర్నీ జరిగే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.

Updated Date - 2020-07-09T22:28:33+05:30 IST