గంగవరం భూ కబ్జాపై రెవెన్యూలో కదలిక

ABN , First Publish Date - 2022-05-28T06:55:04+05:30 IST

మండలంలోని ‘గంగవరంలో భూ కబ్జా’పై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంతో తహసీల్దార్‌ రమాదేవి స్పందించారు.

గంగవరం భూ కబ్జాపై రెవెన్యూలో కదలిక
గంగవరం సర్వే నంబరు 38/1లోని భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

ఆక్రమిత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

సబ్బవరం, మే 27 : మండలంలోని ‘గంగవరంలో భూ కబ్జా’పై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంతో తహసీల్దార్‌ రమాదేవి స్పందించారు. ఆమె ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ, సర్వేయర్‌ కర్రి శ్రీనివాసరావు, వీఆర్వో వెంకటేశ్‌  గంగవరం ప్రాంతానికి వెళ్లారు. కబ్జాకు గురైన సర్వే నంబరు 38/1తోపాటు 38/6, 7, 8, 9, 10, 12లలోని భూములను సర్వే చేశారు. అనంతరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ రమాదేవి మాట్లాడుతూ, గంగవరం సర్వే నంబరు 38/1 పార్టులో ఒక ఎకరం, 38/6 నుంచి 38/12 (సబ్‌డివిజన్లు) వరకు 1.62 ఎకరాలు... మొత్తం 2.62 ఎకరాల మేర ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు సర్వేలో గుర్తించామని చెప్పారు. 38/1లో కొంత భూమిని ఓ వ్యక్తి ఇతరులకు విక్రయించినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ భూమిని అమ్మినట్టు తమకు ఆధారాలు చూపిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్చరిక బోర్డులు తొలగించి మరలా ఆక్రమణలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-05-28T06:55:04+05:30 IST