సాగు, తాగు నీటికి ‘గంగ’ విడుదల

ABN , First Publish Date - 2021-05-18T05:03:50+05:30 IST

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు నీటి కోసం సోమవారం కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.

సాగు, తాగు నీటికి ‘గంగ’ విడుదల
కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి సత్యసాయిగంగ కాలువకు విడుదలవుతున్న తెలుగుగంగ

17ఆర్పీఆర్‌1 కండలేరు హెడ్‌రెగ్యులేటర్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి సత్యసాయిగంగ కాలువకు విడుదలవుతున్న తెలుగుగంగ

రాపూరు, మే 17: చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సాగు, తాగు నీటి కోసం సోమవారం కండలేరు జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. ఈ రెండు జిల్లాల్లో తాగు, సాగు నీటి ఎద్దడి నెలకొని ఉండడంతో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తెలుగుగంగ చీఫ్‌ ఇంజనీరు హరినారాయణరెడ్డి కరోనా నిబంధనలు పాటిస్తూ పవర్‌ స్లూయిస్‌లోని స్విచ్‌ ఆన్‌చేసి సత్యసాయి గంగకాలువకు నీటిని విడుదల చేశారు.  తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని,  అంచలంలెలుగా పెంచుతూ 2500 క్యూసెక్కుల వరకూ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు జిల్లాల్లో సుమారు 2.5లక్షల ఎకరాల్లో సాగులో ఉన్న రెండో పంటకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. 120 రోజులపాటు జలాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. కండలేరు జలాశయం పరిధిలోని అన్ని చెరువులకు నీటిని అందించనున్నట్లు ప్రకటించారు. స్వర్ణముఖి నదికి ‘గంగ’ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల ప్రజలు తాగునీటి కోసం గంగ నీటిని వినియోగించుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి, డీఈఈ రమణ, జేఈఈ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. తొలుత పవర్‌స్లూయిస్‌ వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు. జలాశయంలో సోమవారం 46.503 టీఎంసీల నీటి మట్టం నమోదైంది. ఇన్‌ఫ్లో 150, అవుట్‌ ఫ్లో 755క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-05-18T05:03:50+05:30 IST