‘నువ్వు బచ్చా గాడివి..’ అన్నాడని పాతబస్తీలో గ్యాంగ్‌ వార్‌

ABN , First Publish Date - 2021-06-08T13:00:35+05:30 IST

చిన్న వాదన ఇద్దరు యువకుల మధ్య చిచ్చుపెట్టింది. అది పెరిగి పెద్దదై

‘నువ్వు బచ్చా గాడివి..’ అన్నాడని పాతబస్తీలో గ్యాంగ్‌ వార్‌

  • యువకుడికి గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌ : చిన్న వాదన ఇద్దరు యువకుల మధ్య చిచ్చుపెట్టింది. అది పెరిగి పెద్దదై రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడిచేసుకునేందుకు దారితీసింది. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాతబస్తీలోని ఫర్హాద్‌నగర్‌కు చెందిన అమన్‌ (19), అతడి స్నేహితులైన అబ్బాస్‌, ఫైజల్‌, నైజల్‌లతో కలిసి డబీర్‌పురాలోని చంచల్‌గూడ న్యూరోడ్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు అబ్దుల్లా, కమ్రాన్‌, ముజీబ్‌, నజీబ్‌లను రాత్రి సమయంలో కలిశారు. మాటల సందర్భంలో ‘నువ్వు బచ్చా గాడివంటూ..’ అబ్బాస్‌, అబ్దుల్లాను దూషించాడు. దీంతో ఆగ్రహించిన అబ్దుల్లా తన సత్తా చూపిస్తా దమ్ముంటే రమ్మని సవాల్‌ విసిరాడు. ఇరువరి మధ్య వాగ్వాదం పెరిగి రెండు గ్రూపుల గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 


ఈ గొడవలో అద్నాన్‌ మెడ వెనుక భాగంలో దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన కుటుంబీకులు సమీపంలోని ఆస్పత్రికి, ఆ వెంటనే కాచిగూడలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా వారు చేర్చుకోకపోవడంతో ఉస్మానియాకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బాధితుడి బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై సమాచారమందుకున్న డబీర్‌పురా పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-06-08T13:00:35+05:30 IST