Hyderabad శివారులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
ABN , First Publish Date - 2022-05-01T11:59:00+05:30 IST
Hyderabad శివారులో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం
- పోలీసుల అదుపులో నిందితుడు..
- పరారీలో మరో నలుగురు
హైదరాబాద్ సిటీ/దుండిగల్ : నగర శివారులో దారుణం జరిగింది. ఓ యాచకురాలిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘోరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి చెర నుంచి ఆ మహిళ తప్పించుకుంది. ఆ ఐదుగురు కామాంఽధుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా నలుగురు పరారీలో ఉన్నారు. దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధి గండి మైసమ్మ చౌరస్తాలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. షోలాపూర్కు చెందిన ఓ మహిళ(30) రెండు రోజుల క్రితం నగరానికి వచ్చింది. గండిమైసమ్మ చౌరస్తా ప్రాంతంలో భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కనే నిద్రిస్తోంది.
అయితే, శుక్రవారం అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న ఆ మహిళను చూసిన ఐదుగురు యువకులు ఆటోలో ఎక్కించుకున్నారు. సమీపంలో ఉన్న కాలనీలోని ఓ ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. ఆ ప్రదేశం పక్కన ఉన్న వసతి గృహంలోని యువకులు, స్థానికులు ఈ దుశ్చర్యను గమనించి 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో ఘటనాస్థలికి చేరుకున్న ట్రోలింగ్ సిబ్బంది ఆ మహిళను కాపాడారు. పోలీసుల రాకను గమనించిన యువకులు పారిపోయేందుకు యత్నించగా ఇమ్రాన్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. విచారణలో అతను తనతోపాటు కుద్దూస్(21), ఉముృద్దీన్(21), నరసింహ(23), సాయి(22) ఉన్నారని వెల్లడించాడు. వీరంతా స్థానికంగా ఉండే ఆటో డ్రైవర్లు అని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.