ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజులపాటు గ్యాంగ్‌ రేప్‌

ABN , First Publish Date - 2022-04-22T08:05:24+05:30 IST

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరు

ప్రభుత్వాస్పత్రిలో రెండు రోజులపాటు గ్యాంగ్‌ రేప్‌

విజయవాడలో దారుణం 

మానసిక స్థితి సరిగా లేని యువతిని ప్రేమ పేరిట తెచ్చి

జీజీహెచ్‌ గదిలో బంధించిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి

తోటి ఉద్యోగి, మరో బయటి వ్యక్తితో కలిసి అఘాయిత్యం 

రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే బాధితురాలు

తల్లిదండ్రుల ఫిర్యాదుతో విషయం వెలుగులోకి


విజయవాడ/అమరావతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల పాటు ఓ యువతిపై ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మానసిక స్థితి సరిగా లేని ఓ యువతిని పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఓ ఉద్యోగి దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని, తాను పనిచేసే ఆస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఎవరికీ తెలియకుండా ఆస్పత్రికి రప్పించి ఓ చిన్న గదిలో ఉంచాడు. ఆ యువకుడు, తోటి ఉద్యోగి, ఉద్యోగి స్నేహితుడు ముగ్గురూ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


గురువారం నగర పోలీసు కమిషనర్‌ టి.కాంతిరాణా మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయవాడలోని పాయకాపురం వాంబేకాలనీకి చెందిన దారా శ్రీకాంత్‌ (26) ప్రభుత్వాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌ వద్ద ఫాగింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సీతారామపురం ప్రాంతానికి చెందిన చెన్నా బాబూరావు(23) అక్కడే పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌ తన ఇంటికి సమీపాన ఉన్న 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుని, తాను పనిచేసే ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. శ్రీకాంత్‌ మాటలు నిజమేనని నమ్మిన ఆ యువతి ఈ నెల 19వ తేదీన ఒక బ్యాగ్‌లో దుస్తులు సర్దుకుని, ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. శ్రీకాంత్‌ విధుల్లో ఉన్నప్పుడు ఆమె  ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఓపీ బ్లాక్‌లో రెండో అంతస్తులో లిఫ్ట్‌కు పక్కన పెస్ట్‌ కంట్రోల్‌ సరుకులు భద్రపరుచుకోవడానికి ఓ చిన్న గది ఉంది. శ్రీకాంత్‌ ఆ గదిలో ఆమెను ఉంచాడు. 19వ తేదీ రాత్రి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ తర్వాత ఈ విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పాడు. అతడూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాబూరావు వించిపేటకు చెందిన స్నేహితుడు జె.పవన్‌ కల్యాణ్‌ను ఆస్పత్రికి రప్పించుకున్నాడు.


ఇద్దరూ కలిసి ఆ యువకుడితోనూ యువతిపై అత్యాచారం చేయించారు. బయటకు వెళ్లకుండా ఆస్పత్రిలోనే ఉండాలని ఆ యువతికి శ్రీకాంత్‌ చెప్పాడు. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు అతడ్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని వైద్యం కోసం పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీకాంత్‌తో పాటు బాబూరావు, పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. 15 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని, బాధితురాలికి నష్టపరిహారంగా రూ.5-10 లక్షలు అందజేస్తామని పోలీసు కమిషనర్‌ కాంతిరాణా తెలిపారు. 


పోలీస్‌ అధికారులకు వనిత ఫోన్‌ 

యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ మంత్రి తానేటి వనిత పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా టాటా, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. అత్యాచార ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే బాధ్యులపై చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రికి పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మహిళలు, బాలికలపై నేరాల విషయంలో బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

Updated Date - 2022-04-22T08:05:24+05:30 IST