పాఠశాలల్లో వినాయక విగ్రహాలు
ABN , First Publish Date - 2022-08-20T06:18:01+05:30 IST
కర్ణాటక రాష్ట్రంలో పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ
కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్
బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రంలో పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ ప్రకటించారు. శుక్రవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల వేళ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయవచ్చునని తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు నుంచి పాఠశాల ప్రాంగణాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసే సంపద్రాయం ఉందని పేర్కొన్నారు. వీటికి మినహా ఇతర మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు అనుమతులు లేవని అన్నారు. నమాజ్, ఈద్-మిలాద్ వంటి వాటికి అవకాశం ఇవ్వబోమని తెలిపారు. కాగా విద్యాశాఖ మంత్రి ఈవిషయం ప్రకటించిన వెంటనే.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనుబంధ విద్యార్థి సంఘం క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడు సయ్యద్ మియిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో హిజాబ్కు అనుమతులు ఇచ్చేది లేదని, విద్యాసంస్థల ప్రాంగణంలో ఏ మతానికి చెందిన ఆనవాళ్లు ఉండరాదని చెప్పిన మంత్రి, ప్రస్తుతం వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఎలా అవకాశమిస్తారని ప్రశ్నించారు. విద్యారంగంలో శాంతికి భంగం కలిగించి, రాజకీయ లబ్ధి పొందాలని భావించడం సిగ్గుచేటని అన్నారు.