14.75 టీఎంసీలకు చేరిన గండికోట నీటిమట్టం
ABN , First Publish Date - 2020-09-25T11:20:26+05:30 IST
గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 14.75టీఎంసీలు ఉన్నట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ
22వ రోజు కొనసాగిన నిర్వాసితుల ఆందోళన
కొండాపురం, సెప్టెంబరు 24: గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 14.75టీఎంసీలు ఉన్నట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ రామాంజనేయులు తెలిపారు. గండికోటకు అవుకు రిజర్వాయర్ నుంచి వచ్చే ఇన్ఫ్లో 3వేల క్యూసెక్కులు ఉందన్నారు. ఇందులో వామికొండ, సర్వరాయసాగర్లకు 400క్యూసెక్కులు, సీబీఆర్కు 1100క్యూసెక్కులు, పైడిపాళెం రిజర్వాయర్కు 990క్యూసెక్కులు నీటిని వదులుతున్నట్లు ఈఈ తెలిపారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండడంతో తాళ్లప్రొద్దుటూరు ఎస్సీ కాలనీతో పాటు కొండాపురం రామచంద్రనగర్లో కూడా గండికోట బ్యాక్వాటర్ చేరుతోంది. తాళ్లప్రొద్దుటూరు నిర్వాసితుల ఆందోళన గురువారం 22వ రోజుకు చేరింది.
గండికోట ప్రాజెక్టులో నీటిని పెంచకుండా వెంటనే ఆపాలని, ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతున్నందున తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు. ఇళ్లలోకి నీరు రాకుండా 12టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని, నీళ్లను మిగిలిన రిజర్వాయర్లకు మళ్లించాలని వారు డిమాండ్ చేశారు. కటాఫ్ డేట్ను 2020 డిసెంబరు 31కి పెంచాలని, వెలిగొండ పునరావాస ప్యాకేజీ రూ.12.50లక్షలు చెల్లించాలని, ఖాళీ చేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు నరసింహారెడ్డి, సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చాంద్బాషా, మండల సీపీఐ కార్యదర్శి మనోహర్బాబు తదితరులు పాల్గొన్నారు.