కల్యాణపులోవ కాలువకు గండి
ABN , First Publish Date - 2022-08-17T05:54:46+05:30 IST
కల్యాణపులోవ రిజర్వాయర్ ప్రధాన కాలువకు ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్ వద్ద సోమవారం రాత్రి మళ్లీ గండి పడింది.
నిలిచిన నీటి సరఫరా..
గండి త్వరగా పూడ్చాలని రైతులు వినతి
రావికమతం, ఆగస్టు 16: కల్యాణపులోవ రిజర్వాయర్ ప్రధాన కాలువకు ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్ వద్ద సోమవారం రాత్రి మళ్లీ గండి పడింది. దీంతో ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు నీటిని నిలిపివేశారు. దీంతో ఈ కాలువ దిగువన దమ్ములు నిలిచిపోయాయి. గండి పడిన చోట యుద్ధప్రాతిపదికన పూడ్చాలని రైతులు కోరుతు న్నారు. సుమారు ఐదు వేల ఎకరాలకు సాగునీరందించే ఈ రిజర్వాయర్ ఆయకట్టుకు ఈనెల ఆరున ఎమ్మెల్యే ధర్మశ్రీ చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు పది రోజులపాటు దమ్ములు చేసి, వరినాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో ములకాలపల్లి సమీపంలో ఆక్విడెక్ట్ వద్ద గండి పడి నీరు వృథాగా గెడ్డలోకి పోతోంది. దీంతో అధికారులు కాలువ ద్వారా విడుదలయ్యే నీటిని నిలిపి వేశారు. రైతుల అభ్యర్థన మేరకు బుధవారం ఈ గండిని పూడ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గండిని పూడ్చి ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చర్యలు చేపడుతున్నామని ఏఈ సత్యనారాయణదొర తెలిపారు.