Gandhi Temple: నేడు గాంధీ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2022-08-14T15:41:11+05:30 IST
తేని జిల్లా కామయగౌండన్పట్టిలోని గాంధీ ఆలయం(Gandhi Temple)లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆది వారం ప్రత్యేక పూజలు
పెరంబూర్(చెన్నై), ఆగస్టు 13: తేని జిల్లా కామయగౌండన్పట్టిలోని గాంధీ ఆలయం(Gandhi Temple)లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆది వారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ గ్రామానికి చెందిన పరమశివం, మాజీ ఎంపీ శక్తివడివేల్ సహా 80 మంది గాంధీ నాయకత్వంలో పాల్గొన్నారు. 1948లో గాంధీ మృతిచెందిన అనంతరం ఆయన అస్తికలు దేశంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లగా, వాటిలో ఒకటి కామయగౌండన్పట్టికి తీసుకొచ్చి పూజలు నిర్వహించి నదిలో కలిపారు. అస్తిక ఉంచిన ప్రాంతంలోనే గాంధీ ఆలయం ఏర్పాటైంది. ఆలయంలో గాంధీ, కస్తూరిభాయ్లకు వేర్వేరు మందిరాలుండగా, శివపెరుమాళ్, మహాగణపతి, దుర్గైయమ్మన్, లక్ష్మి, సరస్వతికి సన్నిధు లున్నాయి. ఈ మందిర ప్రాంగణంలో స్వాతంత్య్ర సమరయోధులు చిత్రపటాలు కూడా ఉంచారు. ఆలయంలో ప్రతిరోజు మూడు కాల పూజలు నిర్వహిస్తుండగా, ఇందుకోసం ప్రత్యేకంగా పూజారిని ఏర్పాటుచేసుకున్నారు. గాంధీ జయంతి, గణతంత్ర దినోత్సవం(Republic Day), స్వాతంత్ర దినోత్సవ విశేష రోజుల్లో జరిగే పూజలకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది పాల్గొంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.