ప్లాస్మా థెరపీలో ‘గాంధీ’ సక్సెస్
ABN , First Publish Date - 2020-05-22T09:45:46+05:30 IST
కరోనా పాజిటివ్ రోగికి ప్లాస్మా థెరపీ ఇచ్చి గాంధీ వైద్యులు విజయం సాధించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నగరానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తికి వారం రోజుల క్రితం..
కోలుకున్న కరోనా బాధితుడు
రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్జి
నలుగురు దాతల నుంచి ప్లాస్మా సేకరణ
హైదరాబాద్ సిటీ, మే 21 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్ రోగికి ప్లాస్మా థెరపీ ఇచ్చి గాంధీ వైద్యులు విజయం సాధించారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న నగరానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తికి వారం రోజుల క్రితం ప్లాస్మా థెరపీ చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్జ్జి కూడా చేయనున్నారు. కరోనాను జయించిన వారిలో ఈ వైర్సపై పోరాటం చేసే యాంటీబాడీలు ఉంటాయి. వీటిని కరోనా తీవ్రంగా ఉన్న రోగుల్లోకి ప్రవేశపెట్టి వైర్సను నియంత్రించడంలో గాంధీ వైద్యులు సఫలమయ్యారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్తో చికిత్స పొందుతున్న వారిలో అయిదుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ రోగులు 42 నుంచి 65 ఏళ్లలోపు వయసు వారు. వీరిలో కొందరు శ్వాసకోస, బీపీ, మధుమేహం, డయాలసిస్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులతో వారిలో కరోనా నియంత్రణలోకి రాలేదు. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ అయిదుగురి పేర్లు, వారీ ఆరోగ్య వివరాలు, ఇప్పటి వరకు చేసిన చికిత్సల సమాచారాన్ని గాంధీ వైద్యులు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు నివేదించారు. దీంతో మొదటి దఫాలో ఇద్దరికి ప్లాస్మా థెరపీ చికిత్స ఇవ్వడానికి అనుమతి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర ఆయాసం, న్యుమోనియా, మెదడులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న 44 ఏళ్ల వ్యక్తికి ఫ్లాస్మా థెరపీ ఇవ్వాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో వారం క్రితం ఆ రోగికి మొదటి సారిగా 200 ఎంఎల్ ఫ్లాస్మాను ఎక్కించారు. ఫ్లాస్మా థెరపీ ఇచ్చిన రెండు రోజుల నుంచి అతనిలో మెరుగైన ఫలితాలు కనిపించాయి. కరోనా వైరస్ లక్షణాలు క్రమంగా తగ్గిపోయాయి.
రెండు, సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా అతనిలో నెగిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో అతడిని డిశ్చార్జి చేయడానికి ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోగికి చికిత్స అందించిన రెండు రోజుల తర్వాత మరో రోగికి కూడా ఫ్లాస్మా థెరపీ ఇచ్చారు. అతనిలో కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు నలుగురి నుంచి ఫ్లాస్మా సేకరించారు. వీరిలో మొదటి సారి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన మహేంద్రహిల్స్కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్ ఫ్లాస్మా సేకరించి గాంధీ ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో మైనస్ 80 డిగ్రీల సెల్సియ్సలో రిఫ్రిజిరేటర్లో భద్రపర్చారు.