ఆత్మపరిశీలన అవసరం
ABN , First Publish Date - 2022-10-03T06:35:52+05:30 IST
క్షణికావేశంలో చేసిన నేరాలకు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు శిక్షాకాలంలో ఆత్మపరిశీలన చేసుకుని విడుదలైన తర్వాత తిరిగి నేరాలకు పాల్పడకుండా కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారథి తెలిపారు.
విడుదలైన తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలి
జిల్లా జైలులో గాంధీ జయంతి వేడుకల్లో ప్రధాన న్యాయమూర్తి
గుంటూరు, అక్టోబరు 2: క్షణికావేశంలో చేసిన నేరాలకు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు శిక్షాకాలంలో ఆత్మపరిశీలన చేసుకుని విడుదలైన తర్వాత తిరిగి నేరాలకు పాల్పడకుండా కొత్త జీవితం ప్రారంభించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారథి తెలిపారు. జిల్లా జైలులో ఆదివారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, లాల్బహుదూర్ శాస్ర్తి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహాత్మాగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్రలు ఆదర్శంగా తీసుకుని లోపాలను అధిగమించాలన్నారు. కలెక్టర్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఆవేశంతోనో, తెలియకనో చేసిన నేరాలకు జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలు ఆ సమయాన్ని మంచిగా మారడానికి అవకాశంగా మార్చుకోవాలన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన కోసం జిల్లా కారాగారంలో నిర్వహిస్తున్న గ్రంథాలయానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తరపున సభ్యుడు జి.శ్రీనివాసరావు రూ.10 వేల పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నకుమార్, జైలు సూపరింటెండెంట్ రఘు, పశ్చిమ తహసీల్దారు సాంబశివరావు, డీటీ రమేష్, జైలు వైద్యులు డాక్టర్ కె.లక్ష్మిస్వర్ణలత, జైలర్లు తేజస్విరావు, సీహెచ్ కిరణ్, నాయుడు, డిప్యూటీ జైలర్లు టి.వెంకటరత్నం, కల్యాణబాబు తదితరులు పాల్గొన్నారు. జైలులో నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలు, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ప్రధాన న్యాయమూర్తి బహుమతులు అందజేశారు.