గాంధీ ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-08-17T22:34:40+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ సంచలనం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై..

గాంధీ ఆస్పత్రి ఘటనపై సూపరింటెండెంట్‌ ఏమన్నారంటే..

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ సంచలనం రేపుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రోగికి సహాయకులుగా ఉన్న ఇద్దరు మహిళలపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదందింది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. అత్యాచార ఘటనపై అక్కడి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యాధికారి రాజారావుని వివరణ కోరారు.


ఈ వివాదంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ జరిగిందని ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్నారు. నిన్న మధ్యాహ్నం మీడియా నుంచి ఒక మెసేజ్ వచ్చిందన్నారు. ఆ మెసేజ్‌ను చిలకలగూడ పీఎస్‌కు పంపించామన్నారు. అలాగే ఆస్పత్రిలో కూడా అధికారులతో కమిటీ వేశానన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని, విచారణ జరుగుతోందని చెప్పారు. బాధితులకు మత్తుమందు ఇచ్చి, మూడు రోజులు రూంలో ఉంచడం.. ఇటువంటి పరిస్థితులు గాంధీ ఆస్పత్రిలో లేవన్నారు.


189 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, పోలీసులు, సెక్యూరిటీ ఉన్నారని రాజారావు తెలిపారు. అటెండెంట్స్ ఉండే షెడ్‌లో బాధితురాలు కనిపించినట్లు సీసీ కెమెరాలో కనిపించిందని పోలీసులు చెప్పారన్నారు. అత్యాచారం సెల్లార్‌లో జరిగే అవకాశమే లేదని, ఎందుకంటే అక్కడ క్యాంటిన్, ఒక డిపార్ట్‌మెంట్, మెడికల్ స్టోర్, దోబీఘాట్ ఇన్ని వ్యవస్థలు పని చేస్తుండగా అక్కడ గ్యాంగ్ రేప్ జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. ఏది ఏమైనా పోలీసులు, ఇటు ఆస్పత్రి సిబ్బంది విచారణ జరుపుతున్నారని నిందితులకు శిక్ష పడుతుందని సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-17T22:34:40+05:30 IST