పర్యాటకంగా గాంధీ హిల్
ABN , First Publish Date - 2022-08-12T06:50:28+05:30 IST
గాంధీహిల్ను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దినట్టు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
- హెరిటేజ్ వాక్ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెలంపల్లి
వన్టౌన్, ఆగస్టు 11 : గాంధీహిల్ను పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దినట్టు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని గాంధీహిల్పై గురువారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హెరిటేజ్ వాక్ను ప్రారంభించి, కొండపై స్తూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్లానిటోరియంలో ఫొటో గ్యాలరీని ప్రారంభించి తిలకించారు. కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్పెయింటింగ్, వ్యాసరచన, క్విజ్ తదితర పోటీలలో విజేతలకు ప్రశంసాపత్రాలను అందచేశారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా గాంఽధీహిల్ ఐకాన్గా నిలుస్తుందన్నారు. ఘన చరిత్ర ఉన్న కొండపై పర్యాటకాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇందుకు నగరపాలక సంస్ధ కమిషనర్ స్వప్నిల్దినకర్ పుండ్కర్ కృషి అభినందనీయమని తెలిపారు. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ, గాంధీకొండపై నేటి తరం చిన్నారులకు ఆనాటి స్ఫూర్తి ప్రదాతల జీవిత చరిత్రలను తెలియచేసేందుకు హెరిటేజ్ వాక్ తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాశ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు, గ్రంథాలయచైర్మన్ జమలపూర్ణమ్మ,కార్పొరేషన్ అధికారులు, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.