అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని

ABN , First Publish Date - 2020-10-11T18:10:36+05:30 IST

అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు.

అనంతపురం కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని

అనంతపురం: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు బాలికలకు ఒకరోజు పదవీ బాధ్యతలను అప్పగించారు. ‘బాలికే భవిష్యత్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ,రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లుగా బాలికలు బాధ్యతలు చేపట్టారు. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా  కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఎం.శ్రావణి ఎంపికైంది. జిల్లా కలెక్టర్‌గా ఆమె ఇవాళ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చీరకట్టులో వచ్చిన శ్రావణి కలెక్టర్ కుర్చీలో కూర్చోగా.. పక్కనే చంద్రడు చేతులు కట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ పదవిలో బాలికే ఉండనున్నారు. అధికారిణులుగా బాధ్యతలు స్వీకరించిన వారు... ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయాలని కలెక్టర్ చంద్రుడు శనివారే ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీలు నిర్వహిస్తామంటే వారికి అవకాశం కల్పించాలని ఆదేశించారు.  




ఈ కార్యక్రమం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి బాలికా దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతేగాక అధికారం చేతుల్లో ఉంటే ప్రజలకు, రైతులకు, ముఖ్యంగా మహిళలకు, బాలికలకు ఎలాంటి సేవలు అందిస్తారో విద్యార్థినులతో చెప్పించారు. అదేవిధంగా బాలికా దినోత్సవ ఆవశ్యకతను గురించి, బాలికల చట్టాలు, వాటి వినియోగం గురించి సీనియర్ అధికారులు వివరించారు. తలుపుల, కొత్త చెరువు, గుత్తి, గార్లదిన్నె తదితర మండలాల్లో ప్రతి కార్యాలయానికి బాలికే హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌గా ఉన్నారు. 


ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్‌పై శ్రావణి సంతకం చేశారు. అలాగే రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి  ఫోన్‌లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్‌పై కూడా ఒకరోజు కలెక్టర్ సంతకం చేశారు. 


‘బాలికే భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్‌గా(గ్రామ, వార్డు సచివాలయాలు) ప్రసాద్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న సహస్ర బాధ్యతలు స్వీకరించారు. మరో జాయింట్ కలెక్టర్‌గా(ఆసరా, సంక్షేమం) నారాయణ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న నేత్రశ్రీ, డీఆర్‌ఓగా ఆర్ఎంసీహెచ్ఎస్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమీర, జిల్లా కలెక్టరేట్ ఏవోగా గార్లదిన్నె కేజీవీబీలో తొమ్మిదో తరగతి చదువుతున్న పి.నిఖిల బాధ్యతలు చేపట్టారు.  


Updated Date - 2020-10-11T18:10:36+05:30 IST