శాంసన్ను ధోనీతో పోల్చొద్దు
ABN , First Publish Date - 2020-09-29T08:57:47+05:30 IST
రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ను ధోనీతో పోల్చవద్దని కాంగ్రెస్ నేత శశి థరూర్కు గంభీర్, శ్రీశాంత్ సూచించారు.
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ను ధోనీతో పోల్చవద్దని కాంగ్రెస్ నేత శశి థరూర్కు గంభీర్, శ్రీశాంత్ సూచించారు. పంజాబ్తో ఆదివారంనాటి మ్యాచ్లో 224 పరుగుల లక్ష్య ఛేదనలో చెలరేగి 85 పరుగులు చేసిన శాంసన్ రాజస్థాన్ విజయంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. సంజూ ఇన్నింగ్స్పై థరూర్ స్పందిస్తూ.. ‘ఎంత అద్భుత విజయమది.
దశాబ్ద కాలంగా శాంసన్ నాకు తెలుసు. నువ్వు ధోనీ అంతటి వాడివి అవుతావని 14 ఏళ్ల వయస్సున్నప్పుడే సంజూకు చెప్పా. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఐపీఎల్లో రెండు అమోఘమైన ఇన్నింగ్స్తో ప్రపంచ స్థాయి ఆటగాడు వచ్చేశాడని అర్థమైంది’ అని ప్రశంసలు కురిపించారు. అయితే థరూర్ వ్యాఖ్యలకు గంభీర్, శ్రీశాంత్ స్పందిస్తూ.. ‘వేరెవరి తర్వాతనో ఉండాల్సిన అవసరం సంజూకు లేదు. భారత క్రికెట్కు అతడు సంజూ శాంసన్’ అని అన్నారు.