క్వారంటైన్కు గెలీలియో!!
ABN , First Publish Date - 2020-06-07T08:22:50+05:30 IST
టెలిస్కోప్, లోలక గడియారం, శుక్ర గ్రహంలోని కక్ష్యలు, గురుగ్రహం చుట్టూ పరిభ్రమించే చందమామలు ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలను 400 ఏళ్ల క్రితమే గెలీలియో గెలీలీ
- 400 ఏళ్ల క్రితం ఇటలీని వణికించిన ప్లేగు
- ‘గెలీలియో అండ్ ది సైన్స్ డినయర్స్’లో ప్రస్తావన
న్యూఢిల్లీ, జూన్ 6: టెలిస్కోప్, లోలక గడియారం, శుక్ర గ్రహంలోని కక్ష్యలు, గురుగ్రహం చుట్టూ పరిభ్రమించే చందమామలు ఇలా ఎన్నో ఎన్నెన్నో విషయాలను 400 ఏళ్ల క్రితమే గెలీలియో గెలీలీ కనుగొన్నారు. ఇప్పుడైతే కరోనా వ్యాప్తి నేపథ్యంలో మనం క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి వస్తోంది. 16వ శతాబ్దం లో ప్లేగు మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా జడలు విప్పి నాట్యం చేసింది. దీంతో మహామేధావి గెలీలియో కూడా తన మాతృదేశం ఇటలీలో కొద్ది రోజులు క్వారంటైన్కు వెళ్లారట!! అప్పుడాయన వయసు 69 ఏళ్లట!! ఈవిషయాన్ని తాను రచించిన గెలీలియో జీవిత చరిత్ర పుస్తకం ‘గెలీలియో అండ్ ది సైన్స్ డినయర్స్’లో మారియో లివియో ప్రస్తావించారు.
దీని ప్రకారం.. విశ్వానికి భూమే కేంద్రం అంటూ టాలమీ ప్రతిపాదించిన సిద్ధాంతం.. సూర్యుడే కేంద్రమంటూ కోపెర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతాలను పోల్చుతూ ‘డైలాగ్’ అనే పుస్తకాన్ని గెలీలియో రాసి, అచ్చు వేయించారు. 1632 ఫిబ్రవరికల్లా దీని రాతపనులు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో యావత్ ఇటలీని ప్లేగు వణికిస్తోంది. దీంతో ప్లేగు వ్యాధి కట్టడి నిబంధనలను ఉల్లంఘించారంటూ గెలీలియోపై రోమ్ పాలకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోమ్కు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రోమ్కు బయలుదేరిన గెలీలియో టస్కనీ(ఇటలీ)లో కొన్ని రోజులు క్వారంటైన్లో గడిపారు.