గాలి జనార్ధన్రెడ్డి చెప్పిన విషయం నిజమా? కాదా? తెలుసుకోవాలంటూ.. సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు
ABN , First Publish Date - 2022-09-29T22:53:35+05:30 IST
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి (Janardhana Reddy) బెయిల్ సడలింపుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ చేపట్టింది.
ఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి (Janardhana Reddy) బెయిల్ సడలింపుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ చేపట్టింది. బళ్లారి వెళ్లేందుకు అనుమతించాలంటూ జనార్ధన్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తనకు మనవరాలు పుట్టిందని, చూడడానికి బళ్లారి వెళ్లేందుకు 2 వారాలు అనుమతించాలని కోర్టును కోరారు. గాలి చెప్పిన విషయం నిజమా? కాదా? తెలుసుకోవాలంటూ.. సీబీఐ (cbi)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది. ఇటీవల ఓబుళాపురం మైనింగ్ కుంభకోణానికి సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డిపై నమోదైన కేసుల్లో ఇంతవరకు విచారణ మొదలుపెట్టకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్రమైన ఆరోపణలు ఉన్న ఈ కేసు నమోదై 12 ఏళ్లు నడిచినా ట్రయల్ ప్రారంభించకపోవడం దురదృష్టకర పరిణామంగా పేర్కొంది.
విచారణ వేగవంతం చేయాలని గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశించినా ఎటువంటి పురోగతీ లేదని, దీనిని అనుమతించలేమని, సహించలేమని తేల్చిచెప్పింది. విచారణ ఏ స్థితిలో ఉంది.. ఏయే కారణాలతో ట్రయల్ మొదలుకాలేదు అన్న అంశాలపై ఈ నెల 19వ తేదీలోగా సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని హైదరాబాద్లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ ప్రత్యేక జడ్జి కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. బెయిల్ షరతులను సడలించాలంటూ గాలి జనార్దన్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ట్రయల్ మొదలైందా అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.