‘గగన్యాన్’ బూస్టర్ పరీక్ష సక్సెస్
ABN , First Publish Date - 2022-05-14T08:56:26+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది.
- ఘన ఇంధన బూస్టర్ హెచ్ఎస్-200కు షార్లో భూస్థిర పరీక్ష
- ప్రతిష్ఠాత్మక గగనయాన్ ప్రయోగంలో కీలక ముందడుగు
శ్రీహరికోట (సూళ్లూరుపేట), మే 13: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగనయాన్ ప్రయోగంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రయోగానికి ఉపయోగించనున్న లాంచ్ వెహికల్ మాడ్యూల్-3 (ఎల్విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్ హెచ్ఎ్స-200కు శుక్రవారం ఇస్రో నిర్వహించిన భూస్థిర పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీ్షధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఈ పరీక్ష జరిగింది. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెచ్ఎ్స-200 బూస్టర్లో 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి షార్లోని ఎస్ఎంపీసీ విభాగంలో భూస్థిర పరీక్షను నిర్వహించారు. శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా ఈ బూస్టర్ 135 సెకన్ల పాటు విజయవంతంగా పనిచేసినట్లు ఇస్రో వెల్లడించింది. 700 పారామీటర్లతో ఈ బూస్టర్ పనితీరును పరీక్షించినట్లు పేర్కొంది. బూస్టర్ పరీక్ష విజయవంతం కావడంతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఘన ఇంధన బూస్టర్ను ఇస్రో రూపొందించుకున్నట్లు అయ్యింది. కాగా గగనయాన్ ప్రయోగానికి ఉపయోగించేందుకు జీఎ్సఎల్వీ మార్క్-3 రాకెట్ను వ్యోమగాముల కోసం ఎల్వీఎం-3గా ఆధునికీకరించారు. మూడు దశల ఈ రాకెట్లో తొలిదశ హెచ్ఎ్స-200 బూస్టర్ పరీక్ష విజయవంతం కాగా.. రెండో దశ ద్రవ ఇంధన ఎల్110-జీ మోటా రు, మూడోదశ క్రయో25-జీ మోటారు భూస్థిర పరీక్షలు చివరిదశలో ఉన్నట్టు ఇస్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలిదశ బూస్టర్ భూస్థిర పరీక్షకు ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, తిరువనంతపురం వీఎ్సఎ్సఈ డైరెక్టర్ డాక్టర్ ఎస్. ఉన్నికృష్ణన్, హెచ్ఎ్సఎ్ఫసీ డైరెక్టర్ ఆర్. ఉమామహేశ్వరన్, షార్ డైరెక్టర్ రాజరాజన్లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఇస్రో సెంటర్ల ముఖ్య శాస్త్రవేత్తలు హాజరయ్యారు.