గద్వాలను అక్షరాస్యతల అగ్రగామిగా నిలుపుతా
ABN , First Publish Date - 2020-07-06T11:30:22+05:30 IST
‘ఉన్నత చదువులు చదివా. రాజకీయ అను భవం లేదు. కానీ మెట్టినింటి రాజకీయ వారసత్వం జిల్లా పరిషత్ చైర్పర్సన్ను చేసింది.
అదే నా ముందున్న లక్ష్యం
మంత్రులు, ఎమ్మెల్యేల సహకారం బాగుంది
గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుతయ్య
గద్వాల, జూలై 5: ‘ఉన్నత చదువులు చదివా. రాజకీయ అను భవం లేదు. కానీ మెట్టినింటి రాజకీయ వారసత్వం జిల్లా పరిషత్ చైర్పర్సన్ను చేసింది. ఏడాదిగా ప్రజల బాగు కోసం, వారి అభివృద్ధియే ధ్యేయంగా ముందుకు సాగుతున్నా. ప్రజలతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, తోటి జడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారం లభించడం గర్వంగా భావిస్తున్నా. జిల్లాను అక్షరాస్యతలో అగ్రగామిగా నిలపడంతోపాటు మహిళల్లో చైతన్యం తేవాలన్నదే నా ముందున్న లక్ష్యాలు’ అని గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితాతిరుతయ్య అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఏడాది కాలం పూర్తి చేసు కున్న సందర్భంగా ఆదివారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.
ప్ర: ఏడాదిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కొనసాగారు. ప్రజలు ఏమంటున్నారు?
ప్రజల్లో తిరుగుతున్నప్పుడు వారు చూపిస్తున్న ఆదరణ, ప్రేమాభిమానాలు ఆత్మసంతృప్తినిచ్చాయి.
ప్ర: కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఏమనిపిస్తోంది?
పుట్టినింట రాజకీయ వారసత్వం లేదు. మెట్టినింట ఉన్న రాజకీయ వారసత్వాన్ని అందిపుచుకున్నా. మావారితో పాటు వారి ఇంట అందరూ రాజకీయాల్లో ఉన్నారు. వారి నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయ అనుభవం లేకున్నా, ఏడాది పాటు ప్రజల్లో తిరుగుతున్న క్రమంలో రాజకీయం కొంత మేర తెలిసింది.
ప్ర: ఏడాది పాలనలో సంతృప్తి ఇచ్చినది ఏంటి?
జిల్లాలో మహిళలకు ప్రధానంగా రక్తం అందడం లేదనే విషయం పలుమార్లు బాధించింది. దాంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ యూత్ను ఏర్పాటు చేశాం. వారు అవసరమైన రక్తాన్ని సేకరించి ఇవ్వడం సంతోషాన్ని కలిగించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పలేదు.
ప్ర: రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి సహకారం లభిస్తోంది?
జిల్లాలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, డాక్టర్ అబ్రహం, కలెక్టర్ శ్రుతి ఓఝూ ఇలా అందరి సహకారం ఉంది. జడ్పీటీసీల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అందరూ సహకరిస్తున్నారు.
ప్ర: భవిష్యత్ లక్ష్యం ఏంటి?
జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచాలన్నదే లక్ష్యం. దీని కోసం మం త్రులు, ఎమ్మెల్యేల సహకారాన్ని తీసుకుంటా. మహిళా అక్షరాస్యత పెంపుతో పాటు అందరూ చదువుకునేలా కృషి చేస్తాను.