పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ

ABN , First Publish Date - 2021-10-29T04:38:21+05:30 IST

పంచాయతీ అభివృద్ధి నిధుల గోల్‌మాల్‌పై గురువారం అధికారులు విచారణ చేపట్టారు.

పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై విచారణ
విచారణ చేస్తున్న డీఎల్‌పీవో నాగేశ్వరరావు

పనులు జరగలేదన్న ఫిర్యాదుదారులు

చేశామన్న కార్యదర్శి

ఆరోపణలపై డీఎల్పీవో నాగేశ్వరరావు ఆరా

పుల్లలచెరువు, అక్టోబరు 28 : పంచాయతీ అభివృద్ధి నిధుల గోల్‌మాల్‌పై గురువారం అధికారులు విచారణ చేపట్టారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మర్రివేముల పంచాయతీలో పక్కదారి పట్టాయి. పంచాయతీలో ఒక ప్రణాళిక ప్రకారం జరగాల్సిన పనులు, నిధులను అధికారులు, నాయకులు కుమ్మక్కై సక్రమంగా వినియోగించలేదు. ఇటీవల గ్రామానికి చెందిన కె.కృష్ణ, అంజయ్య, శ్రీనివాసరెడ్డి, మోషేలు గ్రామంలో పనులు చేయకుండానే పంచాయతీ కార్యదర్శి, అప్పటి పంచాయతీ ప్రత్యేక అధికారి కలిసి పంచాయతీ కార్యదర్శి భార్య పేరున రూ.6.91 లక్షల బిల్లులను మార్చుకున్నారని మంత్రి సురే్‌షకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్‌ మార్కాపురం డీఎల్‌పీవో జి.నాగేశ్వరరావును విచారణకు ఆదేశించారు. ఆయన గురువారం గ్రామ సచివాలయంలో ఫిర్యాదుదారులతో కలిసి విచారణ చేపట్టారు. గ్రామంలో పనులు చేయలేదని వారు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి కృష్ణమూర్తి మాత్రం తాను డంపింగ్‌ యార్డు వద్ద మట్టి లెవెలింగ్‌ పనులు చేసి రూ.1.73 లక్షలు, ఎం.ఎర్రబాలెంలో అంతర్గత రోడ్లకు రూ.4.38 లక్షలు ఖర్చు చేశానని తెలిపారు. ఈ పనులకు సంబంధించి బిల్లులు ఇతరుల పేరుతో పెడితే ఇబ్బంది అవుతుందని తన భార్య పేరున మార్చుకున్నట్లు విచారణ అధికారికి తెలిపారు. 2019లో తాము ఎం.ఎర్రబాలెంలో అంతర్గత రోడ్లకు పనులు చేశామని ఫిర్యాదుదారులు కె.కృష్ణ అధికారికి తెలిపారు. ఇన్‌చార్జి ఎంపీడీవో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మండలంలో ఎక్కడా  పంచాయతీ రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని విచారణ అధికారికి తెలిపారు.  ఈ సందర్భంగా డీఎల్‌పీవో నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్ని రికార్డులు పరిశీలించామని, పూర్తిస్థాయి నివేదికను ఉన్నాతాధికారులకు అందిస్తామని చెప్పారు. అనంతరం డీఎల్‌పీవో డంపింగ్‌ యార్డును పరిశీలించారు. ఎం.ఎర్రబాలెం రోడ్లను పరిశీలించలేదు. 

Updated Date - 2021-10-29T04:38:21+05:30 IST