డ్రైనేజీ పనులకు నిధులివ్వండి
ABN , First Publish Date - 2020-07-01T10:30:29+05:30 IST
కడప నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స
ఉప ముఖ్యమంత్రి అంజద్బాషా, ఎంపీ అవినాష్రెడ్డి
కడప (ఎర్రముక్కపల్లె), జూన్ 30 : కడప నగరంలో భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్ బాషా కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం విజయవాడలో ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ మేయరు సురేష్బాబుతో కలిసి మంత్రితో చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో నాలుగు జోన్లుగా విభజించారని, తొలి విడత 3, 4 జోన్లలో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని బొత్సకు వివరించారు. సకాలంలో అందుబాటులోకి తీసుకురాకపోవడంతో ప్రజలు అనధికారికంగా డ్రైనేజీ కనెక్షన్లు ఇచ్చుకోవడంతో చాలాచోట్ల పైపులు పాడైపోయి పగుళ్లు ఏర్పడి మురుగునీరు రోడ్లపైకి వస్తోందన్నారు.
భూగర్భ డ్రైనేజీ కోసం తవ్విన రోడ్లను ప్రజల సౌకర్యార్థం ఇది వరకే పునరుద్ధరణ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే నానాపల్లె వద్ద కేటాయించిన 70 ఎకరాల స్థలంలో మోడల్ టెక్నాలజీని ఉపయోగించి ఎస్టీపీ ప్లాంటు నిర్మించాలని కోరారు. రాబోయే పది సంవత్సరాల వరకు భూగర్భ డ్రైనేజీ నిర్వహణకు సరిపడా నిధులు మంజూరు చేయడంతో పాటు త్వరలో పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి బొత్స కడప నగరంలో 1, 2 జోన్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు తయారు చేసి సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.