లవర్స్ మధ్య సరదా చాటింగ్.. విమానం ఆరు గంటలు ఆలస్యం!
ABN , First Publish Date - 2022-08-16T06:47:37+05:30 IST
ఇద్దరు ప్రేమికుల మధ్య సరదా చాటింగ్ 185 మంది ఉన్న ఓ విమానం ఆలస్యంగా టేకాఫ్ కావడానికి కారణమైంది. సోమవారం మంగళూరు ఎయిర్పోర్టుకు ఇద్దరు లవర్స్ వచ్చారు. అబ్బాయి ముంబై వెళ్లాలి. అమ్మాయి ...
కర్ణాటకలోని మంగళూరు విమానాశ్రయంలో ఘటన
మంగళూరు, ఆగస్టు 15: ఇద్దరు ప్రేమికుల మధ్య సరదా చాటింగ్ 185 మంది ఉన్న ఓ విమానం ఆలస్యంగా టేకాఫ్ కావడానికి కారణమైంది. సోమవారం మంగళూరు ఎయిర్పోర్టుకు ఇద్దరు లవర్స్ వచ్చారు. అబ్బాయి ముంబై వెళ్లాలి. అమ్మాయి బెంగళూరు వెళ్లాలి. ముంబై వెళ్లే విమానం రాగానే అబ్బాయి విమానం ఎక్కాడు. ఎయిర్పోర్టులోనే ఉన్న అమ్మాయికి ఏమీ తోచక బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ సరదాగా.. ‘నువ్వే బాంబర్’ అని మెసేజ్ పెట్టింది. ఇది ఆ అబ్బాయి వెనక సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికురాలి కంట్లో పడింది. వెంటనే ఆమె విమానంలోని సిబ్బందికి చెప్పారు. సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను అప్రమత్తం చేశారు. విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికులను దించేసి అందరి సామాన్లను తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చాటింగ్ చేసుకున్న అమ్మాయి, అబ్బాయిని పోలీసులు కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. సరదా సంభాషణే అని తేలడంతో వదిలేశారు. షెడ్యూల్ టైం కన్నా విమానం ఆరు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు విమానం టేకాఫ్ అయింది. విచారణ అనంతరం అబ్బాయిని విమానం ఎక్కేందుకు అనుమతించారు. కానీ, అమ్మాయి వెళ్లాల్సిన బెంగళూరు విమానం మాత్రం మిస్ అయింది. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.