భలే డిమాండ్.. డబ్బే డబ్బు..

ABN , First Publish Date - 2022-05-12T17:50:18+05:30 IST

భలే డిమాండ్.. డబ్బే డబ్బు..

భలే డిమాండ్.. డబ్బే డబ్బు..

  • వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌
  • మరో పక్క పెరిగిన చార్జీలు
  • డిస్కం ఖజానాకు కాసుల వర్షం
  • ఏప్రిల్‌లో రూ.800 కోట్లు
  • మార్చి కంటే రూ.300 కోట్లు అధికం

హైదరాబాద్‌ సిటీ : వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌కు తోడు ఏప్రిల్‌-01 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రావడంతో గ్రేటర్‌ జోన్‌ డిస్కం ఆదాయం భారీగా పెరిగింది. 9 సర్కిళ్ల పరిధుల్లో 100 శాతం బిల్లింగ్‌ పూర్తయితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్‌పంపిణీ సంస్థ (TSSPDCL)అధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి నెలలో గృహ, కమర్షియల్‌ కేటగిరీలుగా వాడిన విద్యుత్‌కు సంబంధించి డిస్కం రూ. 480 కోట్ల విలువైన బిల్లులను వినియోగదారులకు అందజేసింది. ఏప్రిల్‌లో వినియోగించిన విద్యుత్‌ బిల్లులు ఇప్పటి వరకు రూ. 800 కోట్లుగా లెక్క తేలింది.


పెరిగిన డిమాండ్‌, చార్జీలతో మార్చి నెల కంటే రూ. 300 కోట్లు డిస్కం ఆదాయం పెరిగింది. మే 11వ తేదీ నాటికి బంజారాహిల్స్‌ సర్కిల్‌లో - 96.73 శాతం, సైబర్‌సిటీ- 89.74, హబ్సిగూడ - 90.81, హైదరాబాద్‌ సెంట్రల్‌ - 87.04, హైదరాబాద్‌ సౌత్‌ - 66.71, మేడ్చల్‌ - 90.78, రాజేంద్రనగర్‌ - 68.87, సరూర్‌నగర్‌ - 88.49, సికింద్రాబాద్‌ - 94.24 శాతం బిల్లింగ్‌ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో గ్రేటర్‌జోన్‌ వ్యాప్తంగా 100 శాతం బిల్లింగ్‌ చేస్తే ఆదాయం మరో రూ. 50 కోట్ల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


విద్యుత్‌ డిమాండ్‌తోపాటు యూనిట్‌ చార్జీ ఒకే నెలలో పెరగడంతో గ్రేటర్‌వాసులకు బిల్లుల భారం రెట్టింపయ్యింది. విద్యుత్‌ బిల్లులతోపాటు స్థిర చార్జీలు, అదనపు లోడ్‌ డిమాండ్‌ చార్జీలు జత చేయడంతో రికార్డు స్థాయిలో బిల్లులు పెరిగాయి. రాజేంద్రనగర్‌, సౌత్‌ సర్కిల్‌లో 68, 66 శాతం మాత్రమే ఇప్పటి వరకు బిల్లింగ్‌ చేశారు. సైబర్‌సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌, మేడ్చల్‌ సర్కిళ్ల పరిధుల్లో రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లులు జారీచేశారు. బంజారాహిల్స్‌ సర్కిల్‌లో వందశాతం బిల్లింగ్‌ పూర్తయితే ఆదాయం రూ. 100 కోట్లు దాటుతుందని చెబుతున్నారు. బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఫిబ్రవరిలో రూ. 33 కోట్లు, మార్చిలో రూ. 50 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 62 కోట్ల బిల్లులు జారీ అయ్యాయి. ఫిబ్రవరితో పోల్చితే ఏప్రిల్‌లో రూ. 29 కోట్ల బిల్లులు పెరిగాయని బంజారాహిల్స్‌ డీఈ నరేందర్‌రెడ్డి తెలిపారు.

Read more