దానిమ్మ తొక్కే కదా అని తీసిపారేయకుండా.. ఇలా చేసి చూడండి!

ABN , First Publish Date - 2022-04-13T21:05:30+05:30 IST

వేసవికాలంలో ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగు పర్చుకోవాలంటే ఈ పండ్లు గురించి పట్టించుకోవాల్సిందే. తీపిదనమే కాదు అందానికీ సహకరిస్తాయివి.

దానిమ్మ తొక్కే కదా అని తీసిపారేయకుండా.. ఇలా చేసి చూడండి!

ఆంధ్రజ్యోతి(13-04-2022)

వేసవికాలంలో ఆరోగ్యంతో పాటు అందాన్ని మెరుగు పర్చుకోవాలంటే ఈ పండ్లు గురించి పట్టించుకోవాల్సిందే. తీపిదనమే కాదు అందానికీ సహకరిస్తాయివి.


తర్భూజ

ఎండాకాలంలో తర్భూజ పండుతో ఉపశమనం పొందేవారెక్కువ. వాటి విత్తనాలనూ ఎక్కువ ఇష్టపడతారు. అయితే ఈ తర్భూజ పండుతో అందాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ముఖ్యంగా ఆయిలీ స్కిన్‌ ఉండే వారు ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తర్భూజపండును మెత్తగా చూర్ణం చేయాలి. రెండు టేబుల్‌ స్పూన్ల తర్భూజ పండు చూర్ణంకు, ఒకటేబుల్‌ నిమ్మరసం, ఇంకో టేబుల్‌ స్పూన్‌ శనగపిండిని కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. 


కీరా

నీటిశాతం అధికంగా ఉండే కీరా తింటే చల్లదనం దరిచేరుతుంది. దీంతో పాటు కీరారసంతో చర్మాన్ని కాపాడుకోవచ్చు. కీరా రసంలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించుకోవాలి. లేదా అలొవెరా జెల్‌, కీరా రసం మిక్స్‌ చేసి పట్టిస్తే చర్మంపై ముడుతలు పోతాయి. దీంతో పాటు తురిమిన కీరాకు రెండు స్పూన్లు శనగపిండిని జతచేసి అందులోకి తగినంత రోజ్‌వాటర్‌ కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే నొప్పులు కూడా మాయమవుతాయి. 


దానిమ్మ

యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. మృతకణాల్ని తొలగించే అద్భుతమైన పండు ఇది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇక ఈ దానిమ్మ పండుతో చర్మంలో మెరుపు తీసుకురావచ్చు. తొక్కే కదా అని తీసి పారేయకుండా.. దానిమ్మ తొక్కను స్క్రబర్‌గా ఉపయోగించొచ్చు. దానిమ్మ తొక్కను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలోకి తేనే లేదా నిమ్మరసం వేసి పేస్ట్‌గా చేసుకుని ముఖానికి పట్టిస్తే నొప్పులు పోతాయి. మొటిమలు తొలగిపోతాయి. దానిమ్మ రసంలో తేనె, పెరుగు కలిపి ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం దానిమ్మరసంలో నిమ్మరసం కలిపి మిక్స్‌ చేసి పట్టిస్తే సరి.. ఫ్రెష్‌గా అనిపిస్తుంది. 


ఆరెంజ్‌

పిగ్మెంటేషన్‌ సమస్య ఉండే చోట ఆరెంజ్‌ పండు రసాన్ని పూసుకోవాలి. ఆరెంజ్‌ తొక్కను పడేయకుండా.. ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ పీల్‌ పౌడర్‌ తీసుకుని అందులోకి టేబుల్‌ స్పూన్‌ పెరుగు, టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి మిక్స్‌ చేయాలి. ఆ చూర్ణాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖంలో గ్లో వస్తుంది.రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ రసం ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి రెండు స్పూన్ల శనగపిండి, టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చూర్ణంగా చేసుకుని ఆ పేస్ట్‌ను ఫేస్‌మాస్క్‌ వేసుకుని ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి.

Updated Date - 2022-04-13T21:05:30+05:30 IST