నేటి నుంచి టీకా ఉత్సవ్
ABN , First Publish Date - 2021-04-11T05:19:34+05:30 IST
టీకా ఉత్సవ్ని విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు
- విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం
- వలంటీర్లకు సత్కారంపై సమీక్ష
కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 10: టీకా ఉత్సవ్ని విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయం నుంచి టీకా ఉత్సవ్, వలంటీర్లకు సత్కారం పై శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. జేసీ రామసుందర్ రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకట సుబ్బయ్య, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విశ్వేశ్వరరెడ్డి తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆదివారం నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామ సచివాల యాలు, వార్డు సచివాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని, వైద్య ఆరోగ్య, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు సమన్వ యంతో పని చేయాలని ఆదేశించారు. 26 వేల కొవిడ్ టీకాలను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారుల మధ్య సమాచార లోపం కారణంగా వ్యాక్సినేషన్ నెమ్మదిగా జరుగుతోం దని, చొరవ చూపి వేగవంతం చేయాలని అన్నారు. ఇప్పటికి దాదాపు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని, ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవని కలెక్టర్ అన్నారు. ఆధారాలు లేకుండా కొవిడ్ వ్యాక్సిన్పై పుకార్లు పుట్టిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొవిడ్ టీకాను వృథా చేస్తే వైద్య సిబ్బంది, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ నెల 12 నుంచి 26వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కో నియోజకవర్గంలో వలంటీర్లను సత్కరించాలని జేసీ రామసుందర్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వలంటీర్లను నాలుగు విభాగాలుగా చేసి, వలంటీర్ వజ్ర సేవలకు శాలువ, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జి, రూ.30 వేలు నగదు, వలంటీర్ రత్న సేవలకు శాలువ, గోల్డ్ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జి, రూ.20 వేలు, వలంటీర్ మిత్ర సేవలకు సర్టిఫికెట్, బ్యాడ్జి, రూ.10 వేలు, జనరల్ వలంటీర్ల సేవలకు గుర్తింపుగా బ్యాడ్జీలను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.