నేటి నుంచే ‘మనం-మన పరిశుభ్రత’
ABN , First Publish Date - 2020-06-01T10:09:46+05:30 IST
రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న
కర్నూలు, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను వ్యర్థరహిత పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మనం-మన పరిశుభ్రత’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నారు. ఆరు నెలల్లో వ్యర్ధరహిత గ్రామంగా మార్చేందుకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలం నుంచి రెండు గ్రామ పంచాయతీలను ఎన్నుకుంటారు.
ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల గురించి అవగాహన కల్పించడం తద్వారా గ్రామాన్ని వ్యర్ధరహిత గ్రామంగా తీర్చిదిద్దడం ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. వ్యర్థాలను సేకరించినందుకు గాను గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి రోజూ లేదా వారానికి ఒకసారి రెండు రూపాయల చొప్పున వసూలు చేసి ఆయా గ్రామాల్లో పనిచేసే గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్కు వేతనం చెల్లిస్తారు. నేటి నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని నియోజక వర్గ శాసనసభ్యుడు, ఎంపీడీవో ప్రారంభిస్తారు.