వాటికి దూరంగా... భారతీయులు
ABN , First Publish Date - 2022-01-29T00:56:43+05:30 IST
అమెరికాలో లిస్టైన పాపులర్ టెక్, న్యూ ఏజ్ స్టాక్ మీద పందేలు కట్టిన భారతీయులు... వాటిలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటోన్న వరుస అమ్మకాలతో ఉసూరుమంటున్నారు.
న్యూయార్క్ : అమెరికాలో లిస్టైన పాపులర్ టెక్, న్యూ ఏజ్ స్టాక్ మీద పందేలు కట్టిన భారతీయులు... వాటిలో కొద్ది నెలలుగా చోటుచేసుకుంటోన్న వరుస అమ్మకాలతో ఉసూరుమంటున్నారు. బదులుగా, వడ్డీ రేట్ల పెంపును తట్టుకుని నిలబడగల పెద్ద, ఎస్టాబ్లిష్డ్ కంపెనీలపై దృష్టి సారించారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలున్న బెంచ్మార్క్ నాస్డాక్ ఇండెక్స్ ఈ నెలలో ఇప్పటివరకు 15 % పడిపోయింది. నెట్ఫ్లిక్స్, టెస్లా, రాబిన్హుడ్ వంటి కొన్ని స్టాక్స్ తమ మార్కెట్ క్యాప్లో 30-40 % వరకు నష్టపోయాయి.
తమ ప్లాట్ఫామ్లోని అనేక మంది పెట్టుబడిదారులు డిసెంబరు మధ్య నుంచి లాభాలు బుక్ చేస్తున్నారు. టెస్లా, రాబిన్హుడ్, నెట్ఫ్లిక్స్ వీటిలో కొన్ని. మరోవైపు... ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, గోల్డ్మన్ సాచ్స్ వంటివి జనాదరణ పొందుతున్నాయి. ఇటీవలి కాలంలో వీటిలో అధిక ట్రేడింగ్ వాల్యూమ్స్ చూస్తున్నామని స్టాకాల్ సహ వ్యవస్థాపకుడు సితాశ్వ శ్రీవాస్తవ పేర్కొన్నారు. భారతీయులు గత సంవత్సర కాలంగా ఆయా ప్లాట్ఫామ్ల ద్వారా నేరుగా అమెరికన్ షేర్లను కొనుగోలు చేయడంతోపాటు, యూఎస్ స్టాక్స్పై దృష్టి సారించే లోకల్ మ్యూచువల్ ఫండ్స్లోనూ ఇన్వెస్ట్ చేశారు. వీరంతా బుల్లిష్ మొమెంటంను ఆశించారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ హాకిష్ ఐ కారణంగా పరిస్థితి తారుమారైంది. ఈ క్రమంలో... రిస్క్ తీసుకోవడం క్రమంగా తగ్గిస్తూ వచ్చారు.
ఇటీవలి వరకు, టెక్నాలజీ కంపెనీల నుంచి ఏ సానుకూల వార్త వచ్చినా పెట్టుబడిదారులు ఉత్సాహం చూపిస్తుండడంతో... ఆయా స్టాక్స్ బాగా పెరిగి, హై వాల్యుయేషన్కు చేరుకున్నాయి. ఇక పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఏదైనా ప్రతికూల వార్త, లేదా తక్కువ పనితీరు కనిపించాయంటే మాత్రం ఈ బుడగ పేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.