Pandit killings: జంతర్ మంతర్ నుంచి Kejriwal నాలుగు Demands
ABN , First Publish Date - 2022-06-05T21:49:24+05:30 IST
కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్లో జరుగుతున్న హత్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..
న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని జమ్మూకశ్మీర్లో జరుగుతున్న హత్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) విరుచుకుపడ్డారు. కనీసం నిరసనలు తెలిపేందుకు కూడా కశ్మీర్ పండిట్లను అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అనుమతించడం లేదని ఆరోపించారు. జమ్మూకశ్మీర్లో లక్షిత హత్యలపై (Targeted Killings) జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆదివారంనాడు నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ, లక్షిత హత్యలపై కశ్మీర్ పండిట్లను నిరసనలు తెలిపేందుకు కూడా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం అనుమతించడం లేదని, ఇలా చేస్తూ పోతుంటే ప్రజల సమస్యలు రెట్టింపవుతాయని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందన్నారు.
కశ్మీర్ పండిట్లు కేంద్రంతో సమామావేశం కావాలని కోరుకోవడం లేదనీ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ''1990 శకం మళ్లీ వచ్చింది. ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్లాన్ లేదు. కశ్మీర్లో హత్య జరగ్గానే హోం మంత్రి అత్యున్నత స్థాయి సమావేశం జరుపుతున్నారనే సమాచారం వస్తుంది. ఇక సమావేశాలు చాలించండి. చర్యలు తీసుకోండి. కశ్మీర్కు ఇప్పుడు కావాల్సింది తక్షణ చర్యలు తీసుకోవడమే'' అని సీఎం అన్నారు.
నాలుగు డిమాండ్లు ఇవే...
కశ్మీర్లో లక్షిత హత్యలకు సంబంధించిన కేజ్రీవాల్ నాలుగు డిమాండ్లు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, కశ్మీర్ వెలుపల పనిచేయకుండా కశ్మీర్ పండిట్లతో సంతకాలు చేయించుకున్న బాండ్లు రద్దు చేయాలని, కశ్మీర్ పండిట్ల డిమాండ్లు నెరవేర్చాలని, వారికి భద్రత కల్పించాలని కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.
పాక్ నీచపు ఎత్తుగడలు ఆపాలి...
కశ్మీర్ విషయంలో పాక్ నీచమైన ఎత్తుగడలను మానుకోవాలని కేజ్రీవాల్ హెచ్చరించారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని అన్నారు.