మరణంలోనూ వీడని స్నేహబంధం
ABN , First Publish Date - 2020-03-29T10:19:20+05:30 IST
మండల పరిధిలోని గుడిపాడు సమీపంలో కడప-కర్నూలు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఆటో, స్కూటీ
ఆటో, స్కూటర్ ఢీ.... ఇరువురి మృతి
దువ్వూరు, మార్చి 28: మండల పరిధిలోని గుడిపాడు సమీపంలో కడప-కర్నూలు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఆటో, స్కూటీ ఢీకొని ఇరువురు యువకులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా... కర్నూలు జిల్లా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన టంగుటూరు లిఖిత్కుమార్ (22), ఎస్కే ఖలీల్ (22) యువకులు చిన్ననాటి స్నేహితులు. లిఖిత్కుమార్ కడపజిల్లా అంబవరం సమీపంలోని అంబవరం ఓ ప్రైవేటు సంస్థలో రెండు నెలల క్రితం విధుల్లో చేరాడు. కరోనా వ్యాధి వ్యాప్తి నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో భోజనానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ విషయమై కోవెలకుంట్ల గ్రామంలో ఉన్న స్నేహితుడు ఎస్కే ఖలీల్కు ఫోన్ ద్వారా తెలుపడంతో అతను శుక్రవారం రాత్రి స్కూటీలో కడపకు వెళ్లాడన్నారు. కడపలో శనివారం తెల్లవారుజామున స్నేహితుడు లిఖిత్కుమార్తో బయల్దేరారు. గుడిపాడు సమీపంలోకి రాగానే ఎదురుగా రాంగ్ రూట్లో గూడ్స్ ఆటో వేగంగా వచ్చి ఇరువురిని ఢీకొంది. ఈ ఘటనలో యువకులు ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విషయం తెలుసుకున్న సీఐ కొండారెడ్డి, ఎస్ఐ కుళాయప్పలు సంఘటన స్థలానికి చేరుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఇరువురు చిన్నప్పటి నుంచి స్నేహితులని... మరణంలోనూ కలిసి మృత్యువాత పడటం పట్ల బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.