అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు షర్ట్ అడిగిన ఫ్రెండ్.. ఇవ్వనంటూ స్నేహితుడి హేళన.. ఆ గొడవ ఎంతటి దారుణానికి కారణమైందంటే..

ABN , First Publish Date - 2022-01-05T20:57:36+05:30 IST

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు షర్ట్ ఇవ్వలేదనే కోపంతో ముగ్గురు వ్యక్తులు తమ స్నేహితుడినే చంపేశారు.

అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు షర్ట్ అడిగిన ఫ్రెండ్.. ఇవ్వనంటూ స్నేహితుడి హేళన.. ఆ గొడవ ఎంతటి దారుణానికి కారణమైందంటే..

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు షర్ట్ ఇవ్వలేదనే కోపంతో ముగ్గురు వ్యక్తులు తమ స్నేహితుడినే చంపేశారు. అనంతరం రాష్ట్రం దాటి పారిపోయారు. అయినా ఢిల్లీ పోలీసులు 4500 కిలోమీటర్లు వెంబడించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. డిసెంబర్ 25న ఢిల్లీలోని మంగోల్‌పురి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మంగోల్‌పురికి చెందిన సంతోష్ అనే యువకుడు గత నెల 25న హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. దీంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతోష్ చివరిసారి తన ముగ్గురు స్నేహితులతోనే బయటకు వెళ్లాడని చెప్పింది. 


మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురి కోసం వారి ఇళ్లకు వెళ్లారు. వారు కనిపించడకపోవడంతో వారే సంతోష్‌ను ఏదో చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. సీసీటీవీ ఫుటేజీల సహాయంతో ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, బీహార్, గుజరాత్‌లో గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.  షర్టు కోసమే సంతోష్‌ను చంపేశామని నిందితులు ముగ్గురూ అంగీకరించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 25 మధ్యాహ్నం, రాజ్‌కుమార్ అనే వ్యక్తి సంతోష్‌ను షర్టు ఇవ్వమని అడిగాడు. ఆ షర్టు వేసుకుని అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. అయితే షర్టు ఇచ్చేందుకు సంతోష్ అంగీకరించలేదు. 


రాజ్‌కుమార్ పేదరికాన్ని సంతోష్ ఎగతాళి చేశాడు. అంతేకాదు ఘర్షణ ముదరడంతో రాజ్‌కుమార్‌ను, అతని ఇద్దరు స్నేహితులను కూడా కొట్టాడు. దీంతో ప్రతీకారం తీర్చుకోవాలని రాజ్‌కుమార్, హర్ష్, జావేద్ నిర్ణయించుకున్నారు. అదే రోజు సాయంత్రం సంతోష్‌కు ఫోన్ చేసి పార్టీ ఉందని ఆహ్వానించారు. సంతోష్‌కు మద్యం పట్టించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశారు. ముగ్గురూ వెంటనే అక్కణ్నుంచి పరారయ్యారు. నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలీసులు  తెలిపారు.

Updated Date - 2022-01-05T20:57:36+05:30 IST