స్నేహితుణ్ణి హత్య చేసి.. అతని భార్యతో కాపురం.. రెండేళ్ల తరువాత..

ABN , First Publish Date - 2022-07-02T16:27:50+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్...

స్నేహితుణ్ణి హత్య చేసి.. అతని భార్యతో కాపురం.. రెండేళ్ల తరువాత..

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక కాలువలో ఇటీవల ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మహిళ రాజస్థాన్ నివాసి అని పోలీసుల విచారణలో తేలింది. మృతురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమెను ప్రేమికుడు హత్య చేశాడు. మృతురాలి ప్రేమికుడు ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్. ఇటావా సమీపంలోని ఉస్రాహార్ నివాసి. ఆ మహిళ రెండేళ్లుగా అతనితో కలసి ఉంటోంది. అయితే రెండేళ్ల క్రితం ఆ మహిళ, పిల్లలు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం గురించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. 


గజేంద్ర అనే యువకుడు తన భార్య మిథిలేష్‌తో కలిసి నోయిడాలో గతంలో నివసించినట్లు పోలీసులు తెలిపారు. గజేంద్ర, సతీష్ ఇద్దరూ ఓ ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవర్లు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ తర్వాత సతీష్‌కి గజేంద్ర భార్య మిథిలేష్‌తో సంబంధం ఏర్పడింది. ఈ నేపధ్యంలో సతీష్ యాదవ్, మిథిలేష్‌ కలిసి ఆమె భర్త గజేంద్ర చేత ఫుల్లుగా మద్యం తాగించి, కారులోకి ఎక్కించి ఆ కారును కాలువలోకి తోసేశారు. కాగా గజేంద్ర మృతదేహాన్ని సైఫాయ్ ఎయిర్‌స్ట్రిప్ సమీపంలోని కాలువ నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, పోస్ట్‌మార్టంలో గజేంద్ర కాలువలో మునిగిపోవడం వల్ల మరణించాడని తేలింది. దీని తర్వాత గజేంద్ర భార్య మిథిలేష్ రెండు నెలల పాటు రాజస్థాన్‌లోని జుంజునులో ఉన్న తన అత్తమామల ఇంటికి వెళ్లింది. కుటుంబసభ్యులకు, పిల్లలకు తెలియజేయకుండా అక్కడి నుంచి సతీష్‌తో కలిసి ఇటావాకు చేరుకుంది. అప్పటి నుంచి సతీష్, మిథిలేష్ భార్యాభర్తలుగా జీవించడం ప్రారంభించారు. రెండేళ్ల తర్వాత మిథిలేష్‌కి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని సతీష్‌ అనుమానించాడు. దీంతో సతీష్ పూజల సాకుతో మిథిలేష్‌ను అడవిలోకి తీసుకెళ్లి ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఆ మృతదేహాన్ని కాలువలో పడేశాడు. కేసును విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు సతీష్ నుంచి పిస్టల్, కాట్రిడ్జ్‌లు, హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అతనిని జైలుకు తరలించారు.

Updated Date - 2022-07-02T16:27:50+05:30 IST