అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్తకు `షాక్`!

ABN , First Publish Date - 2022-03-15T19:36:54+05:30 IST

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.. పెళ్లైన నాటి నుంచే భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు తలెత్తేవి..

అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య.. ఆమెను తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్తకు `షాక్`!

అతనికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది.. ఒక కొడుకు కూడా ఉన్నాడు.. పెళ్లైన నాటి నుంచే భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు తలెత్తేవి.. ప్రతిసారి ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం, భర్త బతిమాలి తీసుకు రావడం రివాజుగా మారిపోయింది.. నెల రోజుల కిందట ఆమె భర్తతో గొడవపడి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది.. ఆమెను బతిమాలి తిరిగి తీసుకొచ్చేందుకు వెళ్లిన భర్త అక్కడే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు.. అది హత్యేనని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


హర్యానాలోని అంబాలకు చెందిన మనీష్ కుమార్ అనే వ్యక్తికి నాలుగేళ్ల క్రితం రజినీ అనే యువతితో వివాహం జరిగింది. ఏడాది తర్వాత వీరికి ఓ కొడుకు జన్మించాడు. మనీష్, రజినీ మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. పెద్దలు రాజీ కుదర్చడంతో తిరిగి కలిసేవారు. పదిహేను రోజుల కిందట కూడా భర్తతో మనస్పర్థలు రావడంతో రజినీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను బతిమాలి తీసుకొచ్చేందుకు మనీష్ ఆదివారం ఉదయం అత్తింటికి వెళ్లాడు. 


ఆదివారం రాత్రి మనీష్ అక్కడే ఉండిపోయాడు. అర్ధరాత్రి సమయంలో అతను కరెంట్ షాక్ కొట్టి చనిపోయినట్టు రజినీ తల్లిదండ్రులు.. మనీష్ సోదరుడు లక్ష్మణ్‌కు ఫోన్ చేసి చెప్పారు. అయితే మనీష్‌ది ప్రమాదం కాదని, హత్య అని ఆరోపిస్తూ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రజినీని, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Updated Date - 2022-03-15T19:36:54+05:30 IST