అర్బనలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌

ABN , First Publish Date - 2021-09-29T05:21:54+05:30 IST

అర్బన జిల్లా పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి నేరాలు, సమస్యలు లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేయటమే లక్ష్యంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు.

అర్బనలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌
వెంకటాద్రి పేటలో స్థానికులతో మాట్లాడుతున్న అర్బన ఎస్పీ, ఈస్టు డీఎస్పీ, కొత్తపేట సీఐ

స్టేషన్ల వారీగా ఆయా ప్రాంతాల ఎంపిక

వాటిని దత్తత తీసుకోనున్న అర్బన పోలీస్‌

గుంటూరు, సెప్టెంబరు 28: అర్బన జిల్లా పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి నేరాలు, సమస్యలు లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అమలు చేయటమే లక్ష్యంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు అర్బన ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. ఇందుకుగాను ఓ కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం పోలీసు కార్యాలయంలోని అర్బన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.  సోమవారం తాను పర్యటించిన కొత్తపేట స్టేషన పరిధిలోని వెంకటాద్రిపేట, న్యూ గుంటూరు రైల్వేస్టేషన ప్రాంతాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. అక్కడ సుమారు 30 నివాస గృహాలు ఉంటాయని, వారందరితో నేడో, రేపో స్థానిక సీఐ సమావేశమై వారికి దీనిపై అవగాహన కల్పించి అందరి ఫోను నెంబర్లు సేకరించి వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తారన్నారు. ఆ గ్రూపులో స్థానికులతోపాటు సీఐ, ఎస్‌ఐ, డీఎస్పీ, అదనపు ఎస్పీతోపాటు తాను కూడా సభ్యుడిగా ఉంటామన్నారు. ఆ గ్రూపును నిరంతరం పర్యవేక్షిస్తూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖతోపాటు ఇతర సమస్యలు ఉన్నా సంబంధిత అధికారుల దృష్టికితీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.  ఇదేవిధంగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో అటువంటి ప్రాంతాలను ఎంపిక చేసి  సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం రాత్రి ఈస్టు డీఎస్పీ సీతారామయ్య, కొత్తపేట సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్‌బీ సీఐ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి అర్బన ఎస్పీ వెంకటాద్రిపేట, న్యూ గుంటూరు రైల్వేస్టేషన ప్రాంతాల్లో పర్యటించి స్థానిక మహిళలు, యువతులతో నూతనంగా ప్రారంభించబోతున్న కార్యక్రమం గురించి వారికి అవగాహన కల్పించారు.  ఎస్పీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

  

Updated Date - 2021-09-29T05:21:54+05:30 IST