ఉత్సాహంగా ఫ్రీడం రన్
ABN , First Publish Date - 2022-08-12T05:47:54+05:30 IST
జై జవాన్.. జై కిసాన్.. భారత్ మాతాకీ జై అంటూ... వేలాది గొంతుకల నినాదాలతో కరీంనగర్ మార్మోగింది. స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా గురువారం కరీంనగర్లో నిర్వహించిన ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది.
- స్వాతంత్య్ర వజ్రోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావలి
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ స్పోర్ట్స్, ఆగస్టు 11: జై జవాన్.. జై కిసాన్.. భారత్ మాతాకీ జై అంటూ... వేలాది గొంతుకల నినాదాలతో కరీంనగర్ మార్మోగింది. స్వాతంత్య్ర వజ్రోత్సవంలో భాగంగా గురువారం కరీంనగర్లో నిర్వహించిన ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది. వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కోర్టు చౌరస్తా నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు సాగింది. 500 మీటర్ల భారీ జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ అహింసా మార్గం ద్వారా తెలంగాణ సాధించారన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడి అసువులు బాసిన వారిని, వారి త్యాగాలను సర్మించుకోవాలన్నారు. 16న ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల మార్గంలో పయనిద్దామని అన్నారు. ఫ్రీడం రన్లో మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్కు చెందిన ఇంటర్నేషనల్ శ్యాం బ్యాండ్ ప్రత్యే ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, మేయర్ సునీల్రావు, సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డవేణి మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, డీవైఎస్వో కె రాజవీరు., జిల్లా యువజన అధికారి వెంకటరాంబాబు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు.