లబ్ధిదారులకు అందని ఉచిత బియ్యం
ABN , First Publish Date - 2022-08-07T06:29:49+05:30 IST
మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం అందడం లేదు. స్థానిక జీసీసీ డీఆర్ డిపో సేల్స్మన్ ఇప్పటివరకు పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు.
జీకే వీధిలో పంపిణీ ప్రక్రియను ప్రారంభించని సేల్స్మన్
గూడెంకొత్తవీధి, ఆగస్టు 6: మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఉచిత రేషన్ బియ్యం అందడం లేదు. స్థానిక జీసీసీ డీఆర్ డిపో సేల్స్మన్ ఇప్పటివరకు పంపిణీ ప్రక్రియను ప్రారంభించలేదు. దీంతో ప్రతీ రోజు వందలాది మంది లబ్ధిదారులు జీసీసీ డీఆర్ డిపో వద్దకు వచ్చి తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. శనివారం కూడా అధిక సంఖ్యలో లబ్ధిదారులు వచ్చినప్పటికీ డిపో మూసి ఉండడంతో తిరిగి వెళ్లిపోయారు. జీకే వీధి మండల కేంద్రంలోని డీఆర్ డిపో పరిధిలో సుమారు 500 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు సంబంఽధించిన బియ్యం జీసీసీ గోదాము నుంచి డిపోకు పంపించడం జరిగింది. అయితే సంబంధిత సేల్స్మన్ ఇప్పటికీ బియ్యం పంపిణీ చేయడం లేదు. ఆగస్టు ఒకటి నుంచి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని నెల మొదటి రోజు అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. జీకే వీధిలో మాత్రం ఇప్పటికీ ఆరంభం కాకపోవడంతో గిరిజనులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జీసీసీ బీఎం కృపానందం వివరణ కోరగా, బియ్యం పంపిణీ ప్రారంభించని సేల్స్మన్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.