-
-
Home » Andhra Pradesh » Free rice doute this month-NGTS-AndhraPradesh
-
ఈ నెలా ఉచిత బియ్యం డౌటే?
ABN , First Publish Date - 2022-05-14T09:24:39+05:30 IST
ఈ నెలా ఉచిత బియ్యం డౌటే?
ఇప్పటికీ రేషన్ షాపులకు చేరని పరిస్థితి
ఏప్రిల్లోనూ ఉచిత కోటా ఇవ్వని వైనం
కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. నాన్ సార్టెక్స్ బియ్యం లేవనే కారణంతో ఏప్రిల్లో ఉచిత కోటా ఇవ్వలేదు. ఈ నెలలోనూ పంపిణీపై స్పందించడం లేదు. రెగ్యులర్ కోటా పంపిణీ ముగుస్తున్నా రేషన్ షాపులకు ఇంకా ఉచిత కోటా బియ్యం సరఫరా చేయలేదు. దీంతో ఈ నెలలో కూడా ఉచిత కోటా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో దాదాపుగా రెండేళ్ల నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకోసం రాష్ర్టాలకు ధాన్యం లేదా నగదు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో ఇక్కడి ప్రభుత్వమే బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకుగాను కేంద్రం రాష్ర్టానికి నగదు ఇస్తోంది. ఉచిత కోటా మార్చి నెలతో ముగియాల్సి ఉండగా కేంద్రం మరోసారి ఐదు నెలలు పొడిగించింది. దీంతో రెగ్యులర్ కోటాతో పాటు ఉచిత కోటా కూడా ఇవ్వాలి. అయితే సార్టెక్స్ చేయని బియ్యం లేవనే కారణంతో ఏప్రిల్లో ఉచిత కోటా పంపిణీ చేయలేదు. రెండు నెలల బియ్యం కలిపి మేలో ఇస్తామని గత నెలలో పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇప్పుడు మే నెల వచ్చినా ఇంతవరకూ రేషన్ షాపులకు ఉచిత కోటా బియ్యం సరఫరా చేయలేదు. అసలు ఇస్తారా? లేదా? అనే సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో ఈ నెల కూడా ఉచిత కోటా ఉండకపోవచ్చని డీలర్లు అభిప్రాయపడుతున్నారు. ఉచిత కోటా బియ్యం విషయంలో జగన్ ప్రభుత్వం తొలి నుంచీ ఆసక్తి చూపడం లేదు. రెగ్యులర్ కోటాలో సార్టెక్స్ చేసిన బియ్యం ఇస్తోంది. కేంద్రం ఇచ్చే ఉచిత కోటాకు వచ్చేసరికి సార్టెక్స్ చేయని బియ్యం పంపిణీ చేస్తోంది. నాణ్యమైన బియ్యం హామీ అమలులో భాగంగా వైసీపీ ప్రభుత్వం సార్టెక్స్ పేరుతో నూకలు పూర్తిగా వేరుచేసిన బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వాటికే నాణ్యమైన బియ్యం అనే పేరు పెట్టింది. అందుకోసం స్వల్పస్థాయిలో అదనపు భారం పడుతోంది. మరోవైపు మిల్లులన్నీ సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖకు సరఫరా చేస్తున్నాయి. దీంతో పౌరసరఫరాల శాఖ వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేవు. సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యం ఉచిత కోటాలో పేదలకు ఇవ్వకూడదని భావించిన ప్రభుత్వం ఉచిత కోటాను ఆపేసింది. కొత్తగా సేకరిస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, సార్టెక్స్ చేయని బియ్యాన్ని తెప్పించుకుని సరఫరా చేయాలని భావిస్తోంది.
రెండు కోటాల్లో వేర్వేరు
దేశంలో ఎక్కడాలేని విధంగా జగన్ ప్రభుత్వం పేదలకు ఒకసారి నాణ్యమైన బియ్యం, ఒకసారి నాణ్యతలేని బియ్యం పంపిణీ చేస్తోంది. ఎన్నికలకు ముందు సన్నబియ్యం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయలేక చివరికి నాణ్యమైన బియ్యం అనే విధానం తెచ్చారు. నూక వేరు చేసి, కొంత పాలిష్ చేసి నాణ్యమైన బియ్యం అంటూ పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా కోటాలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని, సార్టెక్స్ చేయని బియ్యం పంపిణీ చేస్తోంది. అంటే ఒకే నెలలో ఒక కోటాలో నాణ్యమైన బియ్యం తినే ప్రజలు, మరో కోటాలో నాణ్యత లేని బియ్యాన్ని తినాలనే విచిత్రమైన విధానం అమలు చేస్తోంది. దీంతో రెగ్యులర్ కోటా బియ్యాన్ని తినడానికి ఉపయోగించుకుంటున్న పేదలు రెండో కోటా బియ్యాన్ని అమ్ముకుంటున్నారు.