ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ!

ABN , First Publish Date - 2021-08-06T06:50:14+05:30 IST

వేల కోట్ల బకాయిల భారంతో గుదిబండగా మారిన వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌)ను ప్రమోటర్లు వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ!

  • వొడాఫోన్‌ ఐడియాలోని  వాటాలను ఉచితంగా ఇచ్చేస్తాం
  • రుణదాతలు, ప్రభుత్వానికి ప్రమోటర్ల ఆఫర్‌ 
  • సంస్థలో ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు 27.66%, 
  • వొడాఫోన్‌ గ్రూప్‌నకు 45 శాతం వాటా


న్యూఢిల్లీ: వేల కోట్ల బకాయిల భారంతో గుదిబండగా మారిన వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌ (వీఐఎల్‌)ను ప్రమోటర్లు వదిలించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కంపెనీలో తమ వాటాలను  ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బ్రిటన్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ గ్రూప్‌నకు చెందిన వొడాఫోన్‌ ఇండియా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఐడియా సెల్యూలార్‌ విలీనం ద్వారా వీఐఎల్‌ ఏర్పాటైంది. ఈ విలీన సంస్థలో వొడాఫోన్‌ పీఎల్‌సీకి 45 శాతం వాటా ఉండగా..   ఆదిత్య బిర్లా గ్రూప్‌ 27.66 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీలోని తమ వాటాను ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం సూచించిన ఏదైనా సంస్థకు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమని ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా జూన్‌ 7న మోదీ సర్కారుకు రాసిన లేఖ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటికి పొక్కిన మరుసటి రోజే (బుధవారం) కుమార మంగళం బిర్లా వీఐఎల్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ ప్రమోటర్‌ వొడాఫోన్‌ సైతం తమ వాటాను రుణదాతలు లేదా ప్రభుత్వ రంగం లోని బీఎ్‌సఎన్‌ఎల్‌కు ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తాజా సమాచారం. 


4 రోజుల్లో 28% క్షీణించిన షేరు’

కంపెనీ బోర్డు నుంచి బిర్లా తప్పుకున్న వార్తల నేపథ్యంలో గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో వీఐఎల్‌ షేరు ధర 24 శాతానికి పైగా క్షీణించి రూ.4.55 వద్ద సరికొత్త ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసుకుంది. మళ్లీ క్రమంగా కోలుకొని, చివర్లో 1.49 శాతం నష్టంతో రూ.5.94 వద్ద స్థిరపడింది. గడిచిన నాలుగు రోజులుగా కంపెనీ షేరు నష్టాల్లో కొనసాగుతోంది. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 28 శాతం క్షీణించింది. 

Updated Date - 2021-08-06T06:50:14+05:30 IST