3 నెలలు.. రూ.19,964 కోట్ల మోసాలు
ABN , First Publish Date - 2020-09-21T06:06:23+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొ త్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్సబీ)ల్లో రూ.19,964 కోట్ల మోసాలు జరిగాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది...
- 12 పీఎ్సబీల్లో 2,867 ఫ్రాడ్ కేసులు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మొ త్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎ్సబీ)ల్లో రూ.19,964 కోట్ల మోసాలు జరిగాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. ఈ త్రైమాసిక కాలంలో మొత్తం 2,867 కేసుల్లో ఈ మోసాలు జరిగినట్లు పీఎ్సబీలు గుర్తించాయని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ మేరకు సమాధానమిచ్చింది.
అత్యధికంగా మోసాలు నమోదైన బ్యాంకుల్లో భారతీయ స్టేట్బ్యాంక్ (ఎస్బీఐ) అగ్రస్థానంలో ఉంది. కాగా విలువపరంగా చూస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) భారీగా నష్టపోయింది. ఎస్బీఐలో గరిష్ఠంగా రూ.2,325.88 కోట్ల విలువైన 2,050 ఫ్రాడ్ కేసులు నమోదు కాగా బీఓఐలో నమోదైన 47 మోసం కేసుల విలువ రూ.5,124.87 కోట్లుగా ఉంది. ఆ తర్వాత కెనరా బ్యాంక్ రూ.3,885.26 కోట్లు (33 కేసులు), బీఓబీ రూ. 2,842.94 కోట్లు (60 కేసులు), ఇండియన్ బ్యాంక్ రూ.1,469.79 కోట్లు (45 కేసులు), ఐఓబీ రూ.1,207.65 కోట్లు (37 కేసులు), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 1,140.37 కోట్లు (9 కేసులు)గా ఉన్నాయి. కాగా పీఎన్బీలో 240 మోసం కేసులు ఉండగా వీటి విలువ కేవలం రూ.270.65 కోట్లుగా ఉండటం గమనార్హం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువగా కేవలం 49 కేసులు నమోదవగా వీటి విలువ రూ.46.52 కోట్లుగా ఉంది.