9 ఏళ్ల క్రితం చనిపోయి మీకు పుట్టానంటూ పదే పదే 4 ఏళ్ల బాలిక మాటలు.. నిజమెంతో తేల్చేందుకు పరీక్షిస్తే..

ABN , First Publish Date - 2022-01-24T19:02:28+05:30 IST

పునర్జన్మ నేపథ్యంలో రాసిన పుస్తకాలు, తీసిన సినిమాలు జనాదరణ పొందాయి.

9 ఏళ్ల క్రితం చనిపోయి మీకు పుట్టానంటూ పదే పదే 4 ఏళ్ల బాలిక మాటలు.. నిజమెంతో తేల్చేందుకు పరీక్షిస్తే..

పునర్జన్మ నేపథ్యంలో రాసిన పుస్తకాలు, తీసిన సినిమాలు జనాదరణ పొందాయి. ఇటీవల నాని హీరోగా నటించిన `శ్యామ్ సింగరాయ్` కూడా ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. గత జన్మలో `శ్యామ్ సింగరాయ్`గా గడిపిన జీవితం తర్వాతి జన్మలో కూడా హీరోకి గుర్తుకు వస్తుంటుంది. అచ్చం అలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ బాలిక కూడా తన గత జన్మ గురించి మాట్లాడుతోంది. 9 ఏళ్ల క్రితం చనిపోయి మళ్లీ పుట్టానని ఆ బాలిక చెబుతున్న మాటలను మొదట్లో ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అయితే ఆమె చెబుతున్నవన్నీ నిజాలేనని తేలడంతో అందరూ షాకయ్యారు. 


ఉదయ్‌పూర్‌కు సమీపంలోని పరావాల్ గ్రామానికి చెందిన రతన్ సింగ్‌కు ఐదుగురు కూతుళ్లు. నాలుగేళ్ల కూతురు కింజల్ గతేడాదిగా తన పూర్వ జన్మ గురించి మాట్లాడుతోంది. తన పేరు ఉష అని, తనది పిప్లాంత్రి గ్రామమని, 2013లో అగ్ని ప్రమాదంలో చనిపోయానని చెబుతోంది. మొదట్లో కింజల్ మాటలను ఎవరూ పట్టించుకోలేదు. కింజల్ చెబుతున్న పిప్లాంత్రి గ్రామం, ఆమె ప్రస్తుతం ఉంటున్న ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీంతో కింజల్ మాటలు ఆ గ్రామంలోని ఉష కుటుంబ సభ్యులకు చేరాయి. వెంటనే కింజల్‌ను ఉష సోదరుడు పంకజ్ కలుసుకున్నాడు. 


పంకజ్‌ను చూసిన వెంటనే కింజల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అతడిని గుర్తు పట్టడమే కాదు.. చిన్న నాటి సంఘటనలను కూడా యథాతథంగా చెప్పింది. షాకైన పంకజ్ జనవరి 14న కింజల్‌ను తన గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఉష తల్లి దుర్గాదేవిని చూసి కింజల్ భోరును విలపించింది. గ్రామంలోని తన స్నేహితులను పలకరించింది. గత జన్మలో తనకు ఇష్టమైన వస్తువుల గురించి మాట్లాడింది. దీంతో అందరూ షాకయ్యారు. 


2013లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఉష చనిపోయిందని, కింజల్ మాటలు, ప్రవర్తన చూస్తుంటే తమ కూతురినే చూస్తున్నట్టు ఉందని ఉష తల్లి దుర్గాదేవి చెబుతున్నారు. ప్రస్తుతం కింజల్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఉష తల్లిదండ్రులను కూడా తరచుగా కలుస్తోంది. రోజూ ఫోన్లో మాట్లాడుతోంది. 

Updated Date - 2022-01-24T19:02:28+05:30 IST