దేవరకొండ డివిజన్లో నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్
ABN , First Publish Date - 2021-07-24T06:21:49+05:30 IST
అర్హతలేనప్పటికీ వైద్యం చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు దేవరకొండ డివిజన్లోని నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల సీజ్ చేశారు.
దేవరకొండ/ నేరేడుగొమ్ము, జూలై 23: అర్హతలేనప్పటికీ వైద్యం చేస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు దేవరకొండ డివిజన్లోని నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల సీజ్ చేశారు. తాజాగా నేరేడుగొమ్ము మండల కేంద్రంలో ఆర్ఎంపీ వెంకటేష్ తిరుమలక్లినిక్ను ఏర్పాటు చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మాదిరిగానే చలామణి అవుతూ అన్ని రకాల వైద్యం చేస్తున్నాడు. వె ౖద్యం వికటించడంతో కొంతమంది జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి వెంకటయ్యపై పిర్యాదు చేశారు. దీంతో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 22న నేరేడుగొమ్ములోని తిరుమలక్లినిక్ను తనిఖీ చేశారు. క్లినిక్లో అన్ని రకాల మందులూ లభ్యమయ్యాయి. అర్హతకు మించి వైద్యం చేస్తున్నాడని నిర్ధారణకావడంతో తిరుమలక్లినిక్ను అధికారుల సీజ్చేసి ఆర్ఎంపీ వెంకటయ్యపై నేరేడుగొమ్ము పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా దేవరకొండ బస్టాండ్ సమీ పంలో సాయిరాం పాలిక్లినిక్ను ఆర్ఎంపీ వైద్యుడు నడుపుతు న్నాడని జిల్లా ఉన్న ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయి. డాక్టర్ జశ్వంత్ ఎంబీబీఎస్ పేరుతో ఆసుపత్రి అనుమతి తీసుకు న్నప్పటికీ ఆర్ఎంపీ వైద్యుడు వైద్యం చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతోపాటు అర్హతలేకున్నా వైద్యం చేస్తున్న మరో రెండు ఆసుపత్రులను దేవరకొండలో ఇటీవల సీజ్ చేశారు. దేవరకొండ డివిజన్లో గిరిజన ప్రజల అమా యకత్వాన్ని ఆసరగా చేసుకొని కొంతమంది వైద్యులు వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దేవర కొండలో వంద పడకల ఆసుపత్రి ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రిలో సక్రమంగా వైద్యం చేయకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలోని కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, చందంపేట, డిండి, నేరేడుగొమ్ము, పీఏపల్లి మండలాల్లో కొంతమంది ఆర్ఎంపీలు గతంలో కరోనా వైద్యం కూడా చేశారని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులకు పిర్యాదులు అందాయి. అర్హతకు మించిన వైద్యం చేస్తు ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్న వైద్యులపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి రవిశంకర్
అర్హతకు మించి ఎవరైనా వైద్యం చేసినట్లయితే తనిఖీలు చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేవరకొండ డివిజన్లో ఇప్పటికే నాలుగు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశాం. అర్హతలేకున్నా వైద్యం చేస్తూ అధిక ఫీజులను వసూళ్లు చేస్తే మాకు పిర్యాదు చేయాలి.