సెల్ఫోన్ల చోరీ కేసుల్లో నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2022-08-17T06:25:55+05:30 IST
పోలీసు స్టేషన్ల పరిధిలో సెల్ఫోను దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ద్వారకా పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు జువెనైల్ హోమ్కు తరలింపు
24 సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సీతంపేట, ఆగస్టు 16: నగరంలోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో సెల్ఫోను దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను ద్వారకా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం...ద్వారకా, స్టేషన్, గాజువాక, ఎంవీపీ పోలీసు స్టేషన్ల పరిధిలో నిందితులు కాపుకాసి సెల్ఫోను మాట్లాడుతున్న వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనానికి పాల్పడుతున్నారు. గాజువాక కణితి రోడ్డుకి చెందిన అబోతుల భరత్(20), న్యూ గాజువాక సింహగిరి కాలనీకి చెందిన దన్నాన అప్పలరాజు, మరో ఇద్దరు జువెనైల్స్తో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదిన సత్యం జంక్షన్ నుంచి గురుద్వారా వైపు నడిచి వెళ్తున్న ఆనంద్కుమార్ వద్ద సెల్ఫోను లాక్కొని దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో ఆనంద్కుమార్ ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బి.నిహార్, ఏఎస్ఐ సత్యనారాయణలు తమ సిబ్బందితో కలిసి దొంగలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిందితులు పట్టుబడ్డారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే నగరంలోని పలు సెల్ఫోనులు దొంగతనం చేసినట్టు అంగీకరించారు. వారి వద్ద నుంచి 24 సెల్ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఏడీసీపీ డి.సూర్య శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ద్వారకా సబ్ డివిజన్ క్రైమ్ సీఐ ఎస్.విజయ్కుమార్ కేసు పర్యవేక్షించారు.