మరోసారి భారతీయ అమెరికన్లకు Joe Biden పెద్ద పీఠ.. నలుగురికి కీలక బాధ్యతలు!

ABN , First Publish Date - 2021-12-22T21:50:35+05:30 IST

మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన ప్రభుత్వంలో నలుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు.

మరోసారి భారతీయ అమెరికన్లకు Joe Biden పెద్ద పీఠ.. నలుగురికి కీలక బాధ్యతలు!

అడ్వైజరీ కమిషన్​లో నలుగురు భారతీయ అమెరికన్లకు చోటు

వాషింగ్టన్: మొదటి నుంచి భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం ఇస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తన ప్రభుత్వంలో నలుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆసియా అమెరికన్లు, నేటివ్​ హవాయన్స్​ సహా పసిఫిక్​ దీవులకు (ఏఏఎన్​హెచ్​పీఐ) చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిషన్​లో నలుగురు భారతీయ అమెరికన్లను నియమించారు. ఈ మేరకు వైట్‌హౌస్ సోమవారం ప్రకటించింది. మొత్తం 23 మంది సభ్యులు ఉండే ఈ అడ్వైజరీ కమిషన్​లో ఇండో అమెరికన్స్ అయిన సోనాల్​ షా, స్మితా షా, అజయ్​ భుటోరియా, కమల్​ కాల్సిలకు చోటు కల్పిస్తున్నట్లు అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొంది. ఆసియా అమెరికన్లు, నేటివ్​ హవాయన్, పసిఫిక్​ దీవులకు చెందిన వారి సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యక్షుడికి ఈ కమిషన్​ సూచనలు చేస్తుంది. 


ఇక డెమోక్రటిక్​ పార్టీకి చెందిన ఆర్థిక వేత్త సోనాల్​ షా విద్యారంగంలో విశేష కృషి చేశారు. అలాగే ఇంజినీర్​, వ్యాపారవేత్త అయిన స్మితా ఎన్​ షా.. చికాగోకు చెందిన స్పాన్​ టెక్​కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్​ కమల్​ సింగ్​ కాల్సి అమెరికా సైన్యానికి 20 ఏళ్ల పాటు సేవలు అందించారు. ఆఫ్గానిస్థాన్​లో ఆయన అందించిన సేవలకు గాను ప్రభుత్వం బ్రాన్జ్​ స్టార్​ మెడల్​ను​ ఇచ్చి ఆయనను గౌరవించింది. సిలికాన్​ వ్యాలీలో టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్​గా పనిచేస్తున్న అజయ్​ భుటోరియా ఏషియన్​ అమెరికన్స్​, పసిఫిక్​ ఐలాండర్స్​ కోసం కృషి చేశారు. ఇలా నలుగురు వివిధ రంగాల్లో తమకంటు ప్రత్యేక గుర్తింపును పొందారు. దీంతో వీరికి బైడెన్ తన పరిపాలన బృందంలో చోటు కల్పించారు. 


Updated Date - 2021-12-22T21:50:35+05:30 IST