గెలుపు డీఎంకేదే.. కానీ ఆ ఒక్క సీటు గురించే తమిళ తంబీల్లో కాక..!
ABN , First Publish Date - 2021-05-02T13:46:12+05:30 IST
గెలుపు డీఎంకేదే.. కానీ ఆ ఒక్క సీటు గురించే తమిళ తంబీల్లో కాక..!
కోయంబత్తూర్: ఈ సారి తమిళనాట ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ సీటుపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి సినీ నటుడు, మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ బరిలో నిలవడమే ఇందుకు కారణం. బీజేపీ నుంచి వనాతి శ్రీనివాసన్, కాంగ్రెస్ తరపున మయూరా జయకుమార్ పోటీలో నిలిచారు. 2008లో డీలిమిటేషన్ జరిగిన అనంతరం ఈ సీటులో రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఆ రెండు పర్యాయాల్లోనూ ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఈసారి ఏఐడీఎంకే-బీజేపీలు కూటమిగా ఏర్పడిన నేపధ్యంలో ఈ సీటు బీజేపీ చేతిలోకి వెళ్లింది.
ఈ సీటును ఏఐడీఎంకే కంచుకోటగా చెబుతుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ కోయంబత్తూరు నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసిన మయూరా జయకుమార్ రెండో స్థానంలో నిలిచారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తిని రేపుతున్న అభ్యర్థుల్లో కమల్ హాసన్ ఒకరు. సొంతంగా పార్టీ ఏర్పాటుచేసి, లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లోనే పోటీ చేయించారు కమల్. అయితే అప్పట్లో కమల్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో కమల్ కీలకంగా మారారు. కమల్ హాసన్కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. లోక్సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో అది మూడు, నాలుగు శాతం ఓటుగా మారింది.
కోయంబత్తూర్ జిల్లాలోని కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో 2,52,389 మంది ఓటర్లు ఉన్నారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలతోపాటు ఉత్తర భారతదేశానికి చెందినవారు ఇక్కడ ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కోయంబత్తూర్ సౌత్ సీటును బీజేపీకి కేటాయించింది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున వనతి శ్రీనివాసన్ రంగంలోకి దిగారు. వరుసగా రెండోసారి ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2016లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆమె 33,113 ఓట్లు దక్కించుకుని మూడో స్థానంలో నిలిచారు. కాగా కోయంబత్తూర్ సౌత్ స్థానానికి అన్నాడీఎంకే సభ్యుడు అమ్మన్ అర్జునన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా బీజేపీకి ఈ స్థానాన్ని కేటాయించడంపై అమ్మన్ మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. పార్టీ హైకమాండ్తో చర్చల అనంతరం వీరు శాంతించారు. అయితే ఈ నేపథ్యంలో కొందరు అమ్మన్ మద్దతుదారులు కమల్ హాసన్కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపించాయి.
మరోవైపు డీఎంకే-కాంగ్రెస్ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మయూర జయకుమార్ పోటీకి దిగారు. కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీకి దిగడం ఆయనకు ఇది రెండోసారి. అన్నాడీఎంకేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తనకు కలిసివస్తుందని జయకుమార్ దీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీపై ఓటర్లు సంతృప్తితో లేరని, ప్రజా వ్యతిరేక పథకాలను కేంద్రం ప్రవేశపెడుతోందని జయకుమార్ ఆరోపిస్తున్నారు. ఇదేసమయంలో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం, సీమన్ నామ్ తమిళార్ కట్చి తదితర పార్టీలు.. అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఓట్లను చీల్చుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది కమల్ హాసన్కు కలిసి వచ్చే అంశమని కూడా చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ కొద్ది గంటల్లో కోయంబత్తూర్ సౌత్ ఎవరిదనేది తేలిపోనుంది.