నలుగురు చిన్నారులను బలిగొన్న నీటికుంట
ABN , First Publish Date - 2022-10-03T00:55:13+05:30 IST
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడపర్తి పంచాయతీ పరిధిలోని గొల్లగూడ గ్రామంలో నలుగురు విద్యార్థులు కుంటలో మునిగి దుర్మరణం పాలయ్యారు.
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడపర్తి పంచాయతీ పరిధిలోని గొల్లగూడ గ్రామంలో నలుగురు విద్యార్థులు కుంటలో మునిగి దుర్మరణం పాలయ్యారు. తాడిపర్తి అడవిలో ఉన్న దర్గాలో నలుగురు విద్యార్థుల బంధువులు నమాజ్ కోసం వెళ్లారు. తల్లిదండ్రులు దర్గావద్దే ఉండగా నలుగురు విద్యార్థులు ఇంటికి వెళ్తున్నట్లు అమ్మానాన్నలకు చెప్పారు. మార్గమధ్యలో నిండుకుండలా ఉన్న ఎర్రకుంటలోకి సరదాగా ఈత కొడదామని దిగారు. కుంట అంచున పెద్దగోతి ఉందని తెలియక ఎండీ రహేన్(10), ఎస్ఆర్ ఇమ్రాన్(9), ఎండీ ఖాలేద్(12) ఇతడి సోదరి సమ్రీన్(14) ఈత రాకపోవడంతో కుంట అంచున ఉన్న పెద్దగోతిలో పడి మునిగిపోయారు. స్థానికంగా పొలం పనులు చేసుకుంటున్న రైతులు బావి వద్ద పిల్లల దుస్తులను చూసి పిల్లలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి బావిలో చూశారు. బావిలో సమ్రీన్ చేయి కనిపించగా మునిగిపోతున్నట్లు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. దీంతో వారు గ్రామస్థులకు, పోలీసులకు సమాచారం అందించారు. నలుగురు చిన్నారుల మృతదేహాలను పంచనామా చేసి శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సీఐ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.