చినుకు పడక... తొలకరి సాగక..!

ABN , First Publish Date - 2022-06-25T06:27:19+05:30 IST

ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది తొలకరి సాగు.

చినుకు పడక... తొలకరి సాగక..!
వర్షం పడుతుందన్న ఆశతో వీరులపాడు మండలంలో పత్తి విత్తనాలు వేస్తున్న కూలీలు

రుతుపవనాలు వచ్చినా తప్పని ఎదురుచూపులు

ఎండిన నీటి వనరులు.. అడుగంటిన భూగర్భ జలాలు

మట్టిలో పడని విత్తనాలు.. ఆందోళనలో రైతులు


ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది తొలకరి సాగు. ఆరుద్ర కార్తె వచ్చినా వరుణ దేవుడు కనికరించకపోవడంతో చినుకు జాడలేదు. రుతు పవనాలు వచ్చాయంటున్నారు తప్పితే నల్లటి మేఘాలు కనిపించటం లేదు. జూన్‌ నాలుగో వారం గడుస్తున్నప్పటికీ తొలకరి రాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 


కంచికచర్ల, జూన్‌ 24 : ఎన్‌టీఆర్‌ జిల్లాలో తొలకరికి మినుము, పెసర, మొక్కజొన్న, కందితో పాటుగా వాణిజ్య పంటలైన పత్తి 45వేల హెక్టార్లలో, మిర్చి 12 వేల హెక్టార్లలో సాగు చేస్తారు. మాగాణి వరి 50వేల హెక్టార్ల వరకు ఉంది. పొలాలు పదును కానందున విత్తనం పడలేదు. రైతులు నెల క్రితమే వేసవిలోనే చెత్త ఏరి, కంప చెట్లు తొలగించి పొలాలను బాగు చేసుకున్నారు. విత్తనాలు చల్లేందుకు భూములు సిద్ధం చేసిన రైతులు వర్షం కోసం వేయికళ్లతో నిరీక్షిస్తున్నారు. ఎండకు మండి నెర్రెలిచ్చిన నేల తల్లి తొలక రి చినుకుల కోసం తపించిపోతోంది. రుతు పవనాలు వచ్చాయని చెపుతున్నారు తప్పితే నల్లటి మేఘాలు జాడ కనిపించటం లేదు. మృగశిర కార్తె వెళ్లి ఆరుద్ర కార్తె వచ్చినా గట్టిగా పదునైన వర్షం పడలేదు. జూన్‌ నెల జిల్లా సాధారణ సగటు వర్షపాతం 92.3 మిల్లీమీటర్లు కాగా, కేవలం 28.6 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే పడింది. అదీ విజయవాడ నగరంలోనే ఎక్కువగా పడింది. కొద్దిగా తిరువూరు ప్రాంతంలో కురిసింది. నందిగామ డివిజన్‌లో చినుకు పడలేదు. మొత్తంగా జిల్లాలో వర్షపాతం 69శాతం లోటులో ఉంది. గట్టి వర్షం పడకపోవటంతో ఎండ మండుతూ ఉక్కపోత ఎక్కువవుతోంది. తొలకరి ఆలస్యం కావటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అక్కడికీ వీరులపాడు, జి.కొండూరు మండలాల్లోని పలు గ్రామాల రైతులు పొలాలు పదును కానప్పటికీ చినుకులు పడతాయన్న ఆశతో పత్తి విత్తనాలు వేసి పొడి మట్టి కప్పారు. కొంత మంది రైతులు మొక్కజొన్న సాగు చేశారు. అందుబాటులోని నీటి వనరులు ఎండిపోయాయి. చెరువులు పూర్తిగా అడుగంటాయి. కాల్వలు నెర్రెలిచ్చి కనిపిస్తున్నాయి. వైరా ఏరు, మునేరు, కట్లేరు ఏడారి ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. జీవనదిగా పేరొందిన కృష్ణానదిలో నీళ్లు లేవు. దీంతో ఎత్తిపోతల పథకాలు, చెరువులు, వాగులు, కాల్వల ఆయకట్టులో ఇప్పట్లో వరినారు మడులు పోసే పరిస్థితి కనిపించటం లేదు. దీనికితోడు భూగర్భ జలాలు అడుగంటాయి. మెట్ట ప్రాంతంలో వరి నారుమళ్లు పోయలేదు. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు కరెంట్‌ కోతతో బోర్లు వద్ద నారుమళ్లు పోసేందుకు రైతులు వెనకాడుతున్నారు. కనీసం మాగాణి భూముల్లో పచ్చిరొట్ట కోసం జీలుగ, పిల్లిపెసర కూడా వేయటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మాగాణి భూములు, బీడు భూములను తలపిస్తున్నాయి. 

Updated Date - 2022-06-25T06:27:19+05:30 IST