ఆరో పెళ్లికి సిద్ధమైన మాజీ మంత్రి... ఆరోపించిన మూడో భార్య!
ABN , First Publish Date - 2021-08-03T12:41:38+05:30 IST
ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో పెళ్లికి...
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో పెళ్లికి సిద్ధమయ్యారని అతని మూడవ భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆగ్రాలోని మంటోలా పోలీస్ స్టేషన్లో ఈ ఉదంతంపై కేసు నమోదయ్యిందని పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. చౌదరి బషీర్ భార్య నగమ్ చౌదరి పోలీసులుకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం జూలై 23న తన భర్త ఆరవసారి పెళ్లి చేసుకోబోతున్నారని పేర్కొన్నారు.
ఇటీవల తాను తన భర్తను కలుసుకున్నప్పుడు అతను తనపై దాడి చేశారని, ట్రిపుల్ తలాక్ కూడా చెప్పారని తెలిపారు. తనకు 2012లో బషీర్తో వివాహం జరిగిందని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తనను అత్తవారింటివారు శారీరకంగా, మానసికంగా వేధిస్తుంటారని ఆమె ఆరోపించారు. దీనిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కేసు కోర్టులో ఉన్నదని నగమ్ చౌదరి తెలిపారు. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నగమ్ చౌదరి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు.