UP: సీఎం యోగిపై మాజీ గవర్నర్ అజీజ్ సంచలన వ్యాఖ్యలు...

ABN , First Publish Date - 2021-09-06T14:08:57+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు....

UP: సీఎం యోగిపై మాజీ గవర్నర్ అజీజ్ సంచలన వ్యాఖ్యలు...

పోలీసు కేసు నమోదు

రాంపూర్ (ఉత్తరప్రదేశ్): ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అతని ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై ఉత్తరప్రదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.అజీజ్ ఖురేషి రాంపూర్ ఎమ్మెల్యే ఖాన్ భార్య తన్జీమ్ ఫాతిమాను కలిసేందుకు అజామ్‌ఖాన్ ఇంటికి వచ్చారు.యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను రక్తం పీల్చే రాక్షసుడితో పోలుస్తూ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త  ఆకాష్ సక్సేనా రాంపూర్ జిల్లా సివిల్ లైన్ పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీపై పోలీసులు కేసు నమోదు చేశారు.


మాజీ గవర్నర్‌ అజీజ్ ఖురేషీపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 124ఎ (సెడిషన్), 153ఎ (మతం, జాతి ప్రాతిపదికన గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 153బి (జాతీయ సమైక్యతకు హాని కలిగించే అంశాలు) 505 (1) ( బి) (ప్రజల్లో భయం కలిగించే ఉద్ధేశం) సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు పెట్టారు. అజామ్ ఖాన్ ఇంటికి వచ్చిన మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను రక్తం పీల్చే రాక్షసుడితో పోల్చారని సక్సేనా ఫిర్యాదులో పేర్కొన్నారు.


సక్సేనా తన ఫిర్యాదులో ‘‘ఖురేషి చేసిన వివాదాస్పద వ్యాఖ్య రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టిస్తుందని, మతపరమైన అల్లర్లకు కూడా దారితీస్తుంది’’ అని పేర్కొన్నారు.మాజీ గవర్నర్ అజీజ్ గతంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ముందస్తు ప్రణాళిక అని అజీజ్ గతంలో ఆరోపించారు.


Updated Date - 2021-09-06T14:08:57+05:30 IST