Trump సంచలన ప్రకటన.. అన్నంత పని చేశారుగా!

ABN , First Publish Date - 2021-10-21T17:50:16+05:30 IST

క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

Trump సంచలన ప్రకటన.. అన్నంత పని చేశారుగా!

వాషింగ్టన్: క్యాపిటల్ భవనం హింసాత్మక ఘటన తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌పై ప్రముఖ సామాజిక మాధ్యమాలన్నీ ముకుమ్మడిగా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ ఆ సయమంలో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు. 'ట్రూత్​ సోషల్​' పేరుతో తీసుకొస్తున్న ఈ సోషల్ మీడియా యా‌ప్‌ను వచ్చే నెలలోనే లాంచ్​ చేయనున్నట్టు వెల్లడించారు. అంతేకాదండోయ్.. తాను తీసుకువస్తున్న ఈ సామాజిక మాధ్యమ వేదిక టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనికోసం ట్రంపునకు చెందిన టీఎమ్​టీజీ(ట్రంప్​ మీడియా అండ్​ టెక్నాలజీ గ్రూప్​)-డిజిటల్​ వరల్డ్​ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీన్ని ధృవీకరిస్తూ ట్రంప్ అధికార ప్రతినిధి లిజ్ హరింగ్టన్ డీల్‌కు సంబంధించిన ఓ కాపీని ట్వీట్ కూడా చేశారు.


ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.."ట్విటర్​లో తాలిబన్ల సంఖ్య చాలా ఎక్కువే. కానీ మీ అభిమాన అధ్యక్షుడికి మాత్రం అందులో చోటు లేదు. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ట్రూత్​ సోషల్​ ద్వారా నిజాయితీతో కూడిన సందేశాలను పంచుకునేందుకు నేను ఎదురుచూస్తున్నా. అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చేందుకే టీఎమ్​టీజీని ఏర్పాటు చేశాం." అని చెప్పుకొచ్చారు. ఇదిలాఉంటే.. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఒప్పుకోని ట్రంప్.. ఈ ఏడాది జనవరి 6న క్యాపిటల్ భవనంపై తన అనుచరులతో దాడి చేయించారు. వందలాది మంది ట్రంప్ అభిమానులు, రిపబ్లిక్ పార్టీ కార్యకర్తలు క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లారు. దీంతో హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన నేపథ్యంలోనే ట్రంప్‌పై సామాజిక మాధ్యమాలు కన్నెర్ర చేశాయి. ఒక్కొక్కటిగా ఆయన ఖాతాలను బ్యాన్ చేశాయి. దాంతో సొంతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకువస్తానని ట్రంప్ ప్రకటించారు. అన్నట్టుగానే ఇప్పుడు 'ట్రూత్​ సోషల్​'ను ప్రారంభిస్తున్నారు.        


Updated Date - 2021-10-21T17:50:16+05:30 IST